పశ్చిమాసియాలో విస్తరిస్తున్న యుద్ధం…
గ్లోబల్ టెక్ కంపెనీలకు తప్పని సెక్యూరిటీ టెన్షన్…
భయాందోళనలో టెక్ ఉద్యోగులు…
Tech War: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), ప్రపంచ ప్రసిద్ధ ఐటీ దిగ్గజ కంపెనీలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్ (IBM), ఎన్విడియా (NVIDIA) మరియు ఒరాకిల్ వంటి అంతర్జాతీయ సంస్థలపై తాము దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఈ సంస్థలు తమ ప్రత్యర్థులకు సహకారం అందిస్తున్నాయని, అందుకే వీటిని లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ మరియు ఆర్థిక రంగాల్లో కలకలం రేపుతోంది.
యుద్ధం ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా, డిజిటల్ మరియు మౌలిక సదుపాయాల వైపు విస్తరిస్తోందని ఇరాన్ సైన్యం అభిప్రాయపడింది. ఖతమ్ అల్ అన్బియా ఎయిర్ డిఫెన్స్ బేస్ అధికార ప్రతినిధి ఈ సంచలన నిర్ణయాలను వెల్లడించారు. తమ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలపై ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని, దానికి ప్రతిఫలంగానే తాము ఈ ఐటీ సంస్థలపై దాడులు చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. తమ దేశ భద్రతను దెబ్బతీసే చర్యలకు సహకరించే ఏ సంస్థను వదిలిపెట్టబోమని ఇరాన్ సైన్యం ఘాటుగా హెచ్చరించింది.
ఈ హెచ్చరికల్లో కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే కాకుండా, కీలకమైన బ్యాంకింగ్ రంగంపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇజ్రాయెల్ లేదా అమెరికా దళాలకు సాంకేతిక సహకారం, డేటా విశ్లేషణ మరియు నిఘా సమాచారాన్ని అందిస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ సంస్థలపై దాడులు చేయడం నైతికంగా మరియు యుద్ధ నియమాల ప్రకారం సబబేనని ఇరాన్ వాదిస్తోంది. ఈ దాడులు సైబర్ రూపంలో ఉంటాయా లేక భౌతిక దాడులా అన్నది స్పష్టత లేనప్పటికీ, పశ్చిమాసియాలోని ఆయా కార్యాలయాలపై ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తగా ఇరాన్ సైన్యం ఒక కీలకమైన సూచన చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజ సంస్థల కార్యాలయాలకు కనీసం ఒక కిలోమీటరు పరిధిలో సామాన్య ప్రజలు ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది. తమ దాడుల వల్ల పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ హెచ్చరిక జారీ చేస్తున్నామని తెలిపింది. ఈ ప్రకటనతో పశ్చిమాసియాలోని ప్రధాన నగరాల్లో ఉన్న టెక్ పార్కులు మరియు ఆర్థిక కేంద్రాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. చాలా కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగుల భద్రతపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి.