AP Investments 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం భారీ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో సుమారురూ. 39,436.84 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు బోర్డు పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఏకంగా 1,11,278 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ముఖ్యంగా ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఈ కొత్త కొలువులు రాబోతున్నాయి.రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను వాడుకుని ఆదాయం పెంచుకోవడంతో పాటు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మొత్తం 31 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో అత్యధికంగా విద్యుత్ రంగంలో 8 ప్రాజెక్టులు, ఐటీ రంగంలో 11 ప్రాజెక్టులు ఉన్నాయి. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి ప్రధాన నగరాలతో పాటు వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు కూడా ఈ పెట్టుబడుల వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.పరిశ్రమల స్థాపనలో భద్రతా ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సౌర విద్యుత్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 325 గిగావాట్ల సోలార్ విద్యుత్ తయారు చేసే సత్తా ఉందని అధికారులు వివరించారు. ఈ అవకాశాన్ని వాడుకుంటే భవిష్యత్తులో మనం ఇతర రాష్ట్రాలకు కూడా కరెంటును అమ్ముకోవచ్చని, దానికి తగ్గట్టుగా ట్రాన్స్మిషన్ లైన్లను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్ వంటి సంస్థలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.
ఐటీ రంగం విషయానికి వస్తే, విశాఖపట్నం మరోసారి ఐటీ హబ్గా మెరవబోతోంది. ప్రముఖ సంస్థ ఇన్ఫోసిస్ యండాడలో రూ. 750 కోట్ల పెట్టుబడితో సుమారు 7,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. అలాగే అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' పేరుతో సరికొత్త టెక్నాలజీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. వీటితో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఏకంగా రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం విశేషం. పర్యాటక రంగంలో విజయనగరం, ఒంగోలు ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి పెరగనుంది.
ఫుడ్ ప్రాసెసింగ్ ఇతర భారీ పరిశ్రమల ద్వారా కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. తిరుపతిలో ఇండస్ కాఫీ, చిత్తూరులో రెడ్బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ వంటి సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే నెల్లూరు, విశాఖపట్నం, శ్రీసిటీ ప్రాంతాల్లో స్టీల్, ప్యాకేజింగ్ ఫార్మా రంగాలు విస్తరించనున్నాయి. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో ఏపీ పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కడమే కాకుండా, లక్షలాది కుటుంబాల్లో ఉద్యోగ కాంతిని నింపబోతోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టింది.