బస్సుల భద్రతపై మంత్రి ఆరా.. పెండింగ్ చలానాలపై సీరియస్…
ప్రయాణికుల భద్రతే మా ప్రాధాన్యం: రవాణా శాఖ మంత్రి మండిపల్లి…
రూల్స్ అతిక్రమిస్తే పర్మిట్లు రద్దు - ప్రైవేట్ ఆపరేటర్లకు మంత్రి హెచ్చరిక…
Minister Ramprasad Reddy: మంగళగిరి సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి, వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు (పర్మిట్లు), ఫిట్నెస్ సర్టిఫికెట్లను స్వయంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సుల పట్ల ఆయన కఠినంగా వ్యవహరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు లాభాల కంటే ప్రయాణికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు వంటి ప్రమాద నివారణ చర్యలు ఉన్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న చలానాలను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణికులతో పాటు అనధికారికంగా సరుకు రవాణా చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. "బస్సుల్లో సరుకు రవాణా చేస్తే.. అదే ఆ బస్సుకు ఆఖరి ట్రిప్పు అవుతుంది" అని హెచ్చరిస్తూ, నిబంధనలు అతిక్రమిస్తే పర్మిట్లు రద్దు చేస్తామని తేల్చి చెప్పారు.
ప్రజా భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, నిరంతరం ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్టీఓ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.