- ఎంఎస్ఎంఈలతో యువతకు ఉపాధి..
- Politics: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత..
Minister Savita: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఆసక్తి కలిగిన యువత ముందుకొస్తే సబ్సిడీ రుణాలు అందజేసి, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు వెన్నుదన్నుగా ఉంటామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని కొండంపల్లి గ్రామంలో ఫెర్టిలైజర్స్, పౌల్ట్రీ ఫీడ్ విక్రయ శాలలను మంత్రి సవిత శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తనను కలిసి విలేకరులతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన యువతతో చిన్న, మధ్యతరహా పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందజేసి, వారికి వెన్నుదన్నుగా నిలువనుందని మంత్రి సవిత వెల్లడించారు.
కూటమి రాకతో పంచాయతీలకు పూర్వవైభవం
వైసీపీ పాలనలో నిధుల లేమితో పంచాయతీల్లో పాలన పడకేసిందని మంత్రి సవిత మండిపడ్డారు. పాడైపోయిన వీధి బల్బులను సైతం మార్చడానికి కూడా వీలుండేది కాదన్నారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఎందరో వైసీపీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరెందరో చేసిన అప్పులు తీర్చడానికి కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఆనాటి జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించారన్నారు. పంచాయతీలను దౌర్జన్యంగా గెలిపించుకోవడంలో ఉన్న శ్రద్ధ నిధులివ్వడంపై లేదని జగన్ నుద్దేశించి విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాకతో పంచాయతీలకు పూర్వవైభవం ప్రారంభమైందన్నారు. కేంద ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు నేరుగా పంచాయతీలకే అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలో గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి చోటుచేసుకుందన్నారు. 2025-26కు సంబంధించి గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి గానూ ప్రతిష్టాత్మక అయిదు కేంద్ర ప్రభుత్వ అవార్డులను ఏపీ పంచాయతీరాజ్ శాఖ గెలుచుకుందన్నారు. ఇదీ కూటమి ప్రభుత్వం పాలనకు మచ్చుతునక అని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.