అమరావతి ఆంధ్రుల గర్వకారణం.. అడ్డుపడితే సహించేది లేదు…
జగన్ మానసిక స్థితి కోల్పోయారు….
ఇకనైనా గందరగోళం ఆపండి.. ఇంట్లో కూర్చోండి…
Amaravati: రాజధాని అమరావతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి ప్రజలు జగన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశంలో ఏ రాజధానికి లేని విధంగా అమరావతిని అత్యద్భుతంగా నిర్మిస్తుంటే, దానిపై విషం చిమ్మడం సరికాదని వారు ధ్వజమెత్తారు. జగన్ తన మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారని, గందరగోళ వ్యాఖ్యలు చేయడం మానుకుని ఆయన ఇంట్లో కూర్చుంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఘాటుగా విమర్శించారు.
అమరావతి నిర్మాణం ఆంధ్రుల ఆత్మగౌరవమని, దానిని అడ్డుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో రాజధానిని నాశనం చేశారని, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం ఆయనకు కేవలం ఒక కల మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విమర్శలు ఆపి, రాజధాని నిర్మాణానికి సహకరించాలని వారు డిమాండ్ చేశారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతుందన్న పూర్తి నమ్మకం తమకుందని తిరుపతి ప్రజలు వెల్లడించారు. విజన్ ఉన్న నాయకుడు పాలిస్తుంటే, అభివృద్ధికి అడ్డుపడటం రాజకీయ స్వార్థమేనని వారు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ తన వైఖరిని మార్చుకోవాలని వారు హితవు పలికారు.