ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో భాగస్వాములవుదాం..
మన పరిసరాలను రక్షించుకునే బాధ్యత ప్రజలంతా తీసుకోవాలి..
మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా మంత్రి జగన్నాథపురంలోని తన నివాసం నుంచి ఎలక్ట్రిక్ సైకిల్పై బయలుదేరి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు కూడా పాల్గొన్నారు. రైతు బజార్ వద్ద ప్రజలు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి, వ్యాపారులతో సరదాగా ముచ్చటించారు.
మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని మంత్రి సూచించారు. ప్రజా రవాణా ఉపయోగిస్తున్న ప్రయాణికులను అభినందిస్తూ, ఇంధన పొదుపు కోసం ప్రతి ఒక్కరూ బస్సులు లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కోరారు. రైతు బజార్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా శుభ్రం చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పౌరులతో మంత్రి పరిశుభ్రత ప్రమాణం చేయించారు. “మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకుందాం” అని అందరూ సంకల్పం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. అందుకే ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. గతంలో “క్లీన్ అండ్ గ్రీన్” పేరుతో ప్రారంభమైన కార్యక్రమమే ఇప్పుడు మరింత విస్తృతంగా కొనసాగుతోందన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై ఇప్పటికే నిషేధం అమల్లో ఉందని, దాన్ని కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు. చెత్తను కేవలం తొలగించడం కాకుండా, తడి చెత్త – పొడి చెత్త వేరు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు పంపాలని చెప్పారు. చెత్తను సక్రమంగా ప్రాసెస్ చేస్తే ఆదాయం కూడా పొందవచ్చని వివరించారు.
రైతు బజార్ ప్రాంతాల్లో ప్లాస్టిక్, కూరగాయల వ్యర్థాలు, కొబ్బరి బొండాలు ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని హెచ్చరించారు. “ఎవరో వచ్చి శుభ్రం చేస్తారు” అని ఎదురు చూడకుండా ప్రతి ఇంటి నుంచే పరిశుభ్రత ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని మంత్రి సూచించారు. జూన్లో వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి ప్రతి కుటుంబం ఒక మొక్క నాటేలా బాధ్యత తీసుకోవాలన్నారు. మొక్క నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. యువత, విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి పేరుతో ఒక మొక్క నాటి దాన్ని పరిరక్షిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ, అదే స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
మున్సిపల్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని, అవసరమైతే ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కమిటీలు ఏర్పాటు చేసి మొక్కల సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. వచ్చే ఆదివారం మంగినపూడి బీచ్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి అక్కడి చెత్తను తొలగించనున్నట్లు తెలిపారు. “మంగినపూడి బీచ్ మన అందరి ఆస్తి.. దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, విద్యాసాగర్, కన్వీనర్ సుశీల్, మరకాని పరబ్రహ్మం, అల్లూరి సోమశేఖర్, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కుంచే నాని తదితరులు పాల్గొన్నారు.