Borsar Village: మధ్యప్రదేశ్లోని బోర్సర్ అనే గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా పల్లెటూళ్లలో చిన్న చిన్న గొడవలు రావడం, ఆ సమయంలో తిట్టుకోవడం సర్వసాధారణం. కానీ, ఈ ఊరిలో మాత్రం అలాంటి పప్పులేమీ ఉడకవు. ఎవరైనా పొరపాటున నోరు జారి బూతు మాట మాట్లాడితే చాలు, వారి జేబుకు చిల్లు పడాల్సిందే. రాష్ట్రంలోనే తొలి 'బూతులు లేని గ్రామంగా' బోర్సర్ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ ఊరిలో ఎవరైనా అసభ్య పదజాలం వాడితే వెంటనే 500 రూపాయల జరిమానా విధిస్తారు. ఒకవేళ డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటే, వారికి మరో శిక్ష కూడా ఉంటుంది. జరిమానాకు బదులుగా గ్రామంలో ఒక గంట పాటు పారిశుధ్య పనులు చేయాలి అంటే ఊరంతా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ముంబయి నుంచి వచ్చిన అశ్విన్ పాటిల్ అనే నటుడు, గ్రామ సర్పంచ్ అందరూ కలిసి ఈ వినూత్న నిర్ణయాన్ని అమలులోకి తెచ్చారు.
కేవలం తిట్లు ఆపడమే కాదు, ఈ గ్రామం అభివృద్ధిలోనూ దూసుకుపోతోంది. ఊరిలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు కనిపిస్తాయి. 'హరిత గ్రామం' లక్ష్యంతో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేశారు. ఊరి యువతకు, పిల్లలకు ఉపయోగపడేలా ఒక చక్కని లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కేవలం చదువుకునే పుస్తకాలే కాకుండా, ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది గ్రామస్థుల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చేందుకు ఎంతో తోడ్పడుతోంది.
నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా గ్రామంలోని నాలుగు ముఖ్యమైన ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించారు. దీనివల్ల విద్యార్థులు ఇంటర్నెట్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాగే గ్రామంలో ఒక 'సేవా కేంద్రం' కూడా నడుస్తోంది. ఎవరైనా దాతలు ఇచ్చే వస్తువులను ఇక్కడ సేకరించి, అవసరమున్న పేదవారికి ఉచితంగా అందజేస్తారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉంటూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
చిన్న చిన్న గొడవలే పెద్ద వివాదాలకు కారణమవుతున్నాయని గుర్తించిన గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. ఊరంతా పోస్టర్లు వేసి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, ప్రతి వార్డులో ప్రత్యేక బృందాలు నిఘా పెడుతున్నాయి. ఇలా క్రమశిక్షణతో పాటు అభివృద్ధిని జోడించి బోర్సర్ గ్రామం ఇతర పల్లెలకు ఆదర్శంగా నిలుస్తోంది. గొడవలు లేని, పచ్చని ప్రకృతితో నిండిన ఈ ఊరు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.