Vizianagaram Politics: విజయనగరం జిల్లా రాజకీయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అర్థరాత్రి వరకు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజల్లోకి వెళ్లని నాయకులకు భవిష్యత్తు ఉండదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు దాటుతున్నా, ఆశించిన స్థాయిలో జిల్లాలో మార్పు రాలేదని సీఎం చురకలు అంటించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, తన తండ్రి రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని, తాను స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటున్నానని వివరణ ఇచ్చారు. అయితే, అందరినీ కలుపుకుని వెళ్లడమే నాయకత్వ లక్షణమని, జిల్లా నేతల మధ్య సమన్వయం పెంచాలని సీఎం సూచించారు.
నియోజకవర్గాల వారీగా జరిగిన సమీక్షలో ఎస్.కోట ఎమ్మెల్యే లోకం మాధవి తీరుపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చి, పనితీరులో వెనుకబడి ఉండటం సరికాదని హితబోధ చేశారు. స్థానిక నాయకులతో సఖ్యతగా ఉంటూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే సీనియర్ నేతలు కళా వెంకటరావు, బేబీ నాయన వంటి వారు కూడా తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, కేడర్ను యాక్టివేట్ చేయాలని సూచించారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, కేవలం పైస్థాయి రాజకీయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. కేంద్ర పథకాలు జిల్లాకు చేరేలా ఎంపీ చొరవ తీసుకోవాలని కోరారు. పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ గ్రాఫ్ పెంచుకోవాలని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో నమోదైన అక్రమ కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమైన సమయంలో ఆందోళనలు చేసిన తెలుగుదేశం కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించి, అన్యాయంగా ఇబ్బందులు పడుతున్న వారిపై కేసులను తొలగించాలని పేర్కొనడం జిల్లా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.