డీఏ బకాయిలను చెల్లించనున్న ప్రభుత్వం..
ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందాల వెల్లువ..
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది నుంచి టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 2.1 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఇప్పటివరకు 50.7 శాతంగా ఉన్న డీఏ, తాజా పెంపుతో 52.8 శాతానికి చేరుకుంది. దీంతో ఉద్యోగుల జీతాల్లో కొంత పెరుగుదల కనిపించనుంది.
గత మూడు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ప్రతి నెలకు సంబంధించిన మొత్తం సప్లిమెంటరీ బిల్లుల ద్వారా విడతల వారీగా అందించనున్నట్లు వెల్లడించింది.
ఇక చివరిసారిగా 2025 జూలైలో కూడా 2.1 శాతం డీఏ పెంపు జరిగింది. అప్పట్లో డీఏ 48.6 శాతం నుంచి 50.7 శాతానికి పెరిగింది. ప్రస్తుతం మరోసారి అదే స్థాయిలో పెంపు ఇవ్వడంతో మొత్తం డీఏ 52.8 శాతానికి చేరింది.
ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో డీఏ పెంపు తమకు కొంత ఉపశమనం ఇస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక స్థితికి మద్దతుగా నిలవనుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.