- Politics: పర్యాటకానికి కొత్త మలుపు: హంసలదీవి, సూర్యలంక బీచ్లకు ఇక హైవే హంగులు..
- "గోవా బీచ్లను తలపించేలా ఏపీ తీరం": సీ షోర్ హైవేతో పర్యాటక రంగానికి మహర్దశ..
Bapatla AP New Sea Shore Highway: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ముఖచిత్రాన్ని మార్చే విధంగా నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు 120 కిలోమీటర్ల పొడవున సరికొత్త ‘సముద్ర తీర రహదారి’ (సీ షోర్ హైవే) నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎన్హెచ్-216 (కత్తిపూడి-ఒంగోలు) విస్తరణకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. సాధారణంగా జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలంటే భారీగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది, దీనివల్ల వేల కోట్ల రూపాయల పరిహారం చెల్లించడమే కాకుండా అనేక భవనాలు, గ్రామాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సముద్ర తీరం వెంబడి కొత్త రహదారిని నిర్మిస్తే భూసేకరణ భారం తప్పుతుందని, తక్కువ ఖర్చుతో వేగంగా పనులు పూర్తి చేయవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలత వ్యక్తం కావడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ సీ షోర్ హైవే నిర్మాణం వల్ల కేవలం రవాణా సౌకర్యాలే కాకుండా బందరు పోర్టు, నిజాంపట్నం పోర్టుల మధ్య అనుసంధానత పెరిగి సరుకు రవాణాకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలను కలిపే ఈ రహదారి పర్యాటక రంగానికి మణిమకుటంగా మారనుంది. ప్రస్తుతం సరైన దారి లేక పర్యాటకులకు దూరంగా ఉన్న పెద్దగొల్లపాలెం, పెదపట్నం, హంసలదీవి వంటి అద్భుతమైన బీచ్లకు ఈ హైవే ద్వారా మహర్దశ పట్టనుంది. గోవా తీరాలను తలపించే ఈ ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో సముద్రంలో కలిసే కాల్వల వద్ద ఫ్లైఓవర్లు లేదా ఆర్వోబీలు నిర్మించడం ద్వారా ప్రయాణం మరింత సులభతరం అవుతుందని ఈ ప్రణాళికలో పొందుపరిచారు.
ఆర్థిక ప్రయోజనాలతో పాటు పర్యావరణ రక్షణలోనూ ఈ హైవే కీలక పాత్ర పోషించనుంది. మచిలీపట్నం తీర ప్రాంతంలో సముద్రపు కోతను నివారించేందుకు ఈ రహదారి ఒక రక్షణ కవచంలా (బండ్) పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా కృత్తివెన్ను మండలంలోని తీర గ్రామాలు సముద్రపు కోతకు గురికాకుండా ఈ నిర్మాణం అడ్డుకుంటుంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్ జడ్) నిబంధనల ప్రకారం రహదారుల నిర్మాణానికి ఆటంకాలు ఉండవని, కాబట్టి కేంద్రం నుంచి అనుమతులు సులభంగానే వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పారిశ్రామికంగా, పర్యాటక పరంగా దేశంలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.