ఇటీవల భారత్–చైనా మధ్య వైమానిక రవాణా మళ్లీ చురుకుగా మారుతోంది. ఐదేళ్ల విరామం తర్వాత చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ షాంఘై–ఢిల్లీ మధ్య నేరుగా నడిపే విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఇప్పుడు, పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థ 2026 జనవరి 2 నుంచి ఢిల్లీ–షాంఘై మధ్య సర్వీసులను మరింత విస్తరించనుంది. ప్రస్తుతం వారానికి మూడు విమానాలు నడుస్తుండగా, కొత్త షెడ్యూల్ ప్రకారం వారానికి ఐదు విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయం భారత మార్కెట్లో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడమే కాకుండా, రెండు దేశాల మధ్య వాణిజ్య, పర్యాటక, విద్య సంబంధాలను మరింత బలపరచనుందని కంపెనీ స్పష్టం చేసింది.
సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో కొత్త షెడ్యూల్ ప్రకారం విమానాలు నడుస్తాయి. ఢిల్లీ నుండి బయలుదేరే MU564 ఫ్లైట్ రాత్రి 7:55 గంటలకు ఎగరగా, మరుసటి రోజు ఉదయం 4:10 గంటలకు షాంఘై చేరుకుంటుంది. షాంఘై నుంచి బయలుదేరే MU563 ఫ్లైట్ మధ్యాహ్నం 12:50 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5:45 గంటలకు న్యూఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. ఈ రూట్ కోసం సంస్థ ఆధునిక ఎయిర్బస్ A330-200 వైడ్-బాడీ విమానాలను వినియోగిస్తోంది. వీటిలో 17 బిజినెస్ క్లాస్, 245 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
భారత్లో చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ సర్వీసులకు సంబంధించిన టికెటింగ్, సేల్స్, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను ఇంటర్గ్లోబ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సంస్థ పర్యవేక్షించనుంది. ఈ కంపెనీ భవిష్యత్తులో షాంఘై–ముంబై, కున్మింగ్–కోల్కతా మార్గాల్లోనూ కొత్త సర్వీసులు ప్రారంభించే యోచనలో ఉంది. ఇంతకుముందు, 2019లో ఇరు దేశాల మధ్య దాదాపు 2,500 కంటే ఎక్కువ షెడ్యూల్డ్ ఫ్లైట్లు నడిచినట్లు ట్రావెల్ డేటా ప్రొవైడర్ OAG వెల్లడించింది. అయితే కరోనా తర్వాత ఈ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు తిరిగి పునరుద్ధరించబడటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే, భారత విమానయాన సంస్థ ఇండిగో కూడా చైనాతో వైమానిక సంబంధాలను బలోపేతం చేస్తోంది. తాజాగా కోల్కతా నుంచి గ్వాంగ్జౌకు ఇండిగో నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా 180 మంది భారత ప్రయాణికులు గ్వాంగ్జౌ చేరుకోగా, చైనా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా నవంబర్ 10 నుంచి ఢిల్లీ–గ్వాంగ్జౌ మధ్య రోజువారీ నేరుగా ఫ్లైట్లు నడపనున్నట్లు ఇండిగో ఇప్పటికే ప్రకటించింది. దీంతో రాబోయే నెలల్లో భారత్–చైనా మధ్య ప్రయాణాలు గణనీయంగా పెరగనున్నాయి.