దేశంలో గ్యాస్ నిల్వలు పెంచేందుకు కేంద్రం కసరత్తు…
దేశంలో ఇంధన సంక్షోభం రాకుండా మాస్టర్ ప్లాన్…
గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్కు చెక్…
Oil Refineries: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. చమురు శుద్ధి సంస్థలు (Refineries), పెట్రోకెమికల్ యూనిట్లపై కేంద్రం ఎస్మా (ESMA - అత్యవసర సేవల నిర్వహణ చట్టం) తరహాలో 'అత్యావసర వస్తువుల చట్టం-1955'ను ప్రయోగించింది. పెట్రోల్, డీజిల్, ముఖ్యంగా వంట గ్యాస్ (LPG) కొరత రాకుండా చూడడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం. అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నా, దేశీయంగా సామాన్యుడికి ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది.
ప్రస్తుత పరిస్థితుల్లో డొమెస్టిక్ గ్యాస్ (వంట గ్యాస్), ఎరువుల ఫ్యాక్టరీలు మరియు పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గృహ అవసరాలకు వాడే పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మరియు వాహనాలకు వాడే సీఎన్జీ (CNG) సరఫరాలో ఎటువంటి కోత లేకుండా 100 శాతం నిరంతరాయంగా అందించాలని నిర్ణయించింది. అలాగే వ్యవసాయ రంగానికి కీలకమైన ఎరువుల ఉత్పత్తి ఆగిపోకుండా, ఆయా ఫ్యాక్టరీలకు గత వినియోగంలో కనీసం 70 శాతం గ్యాస్ను తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించింది.
అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా ఉండేందుకు పెట్రోలియం శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దీనిలో భాగంగా ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆయిల్ రిఫైనరీలను ఆదేశించింది. సాధారణంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీకి వాడే ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువులను ఇతర అవసరాలకు మళ్లించకుండా, కేవలం వంట గ్యాస్ తయారీకే ఉపయోగించాలని నిబంధన విధించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ (IOC), బీపీసీఎల్ (BPCL), హెచ్పీసీఎల్ (HPCL)లకు ఈ గ్యాస్ను తక్షణమే అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం కోరింది.
చమురు సంస్థలు లాభాల కోసం ఇంధనాన్ని ఇతర రంగాలకు మళ్లించకుండా లేదా కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నిఘా ఉంచింది. ఒకవేళ ఏ సంస్థ అయినా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే, వారిపై కఠినమైన జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పారిశ్రామిక వినియోగం కంటే ప్రజల అవసరాలే ముఖ్యమని పేర్కొంటూ, పరిశ్రమలకు ఇచ్చే గ్యాస్ సరఫరాపై 65 నుండి 80 శాతం వరకు పరిమితులు విధించింది. దీనివల్ల గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎటువంటి జాప్యం ఉండదు.