Chinthakaya Chepala Pulusu: చేపల పులుసు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ పులుపు ఘాటైన కారం కలగలిసి అద్భుతమైన రుచినిస్తాయి. సాధారణంగా మనం చింతపండు లేదా మామిడికాయతో పులుసు పెట్టుకుంటాం కానీ, పచ్చి చింతకాయలతో చేసే చేపల పులుసు రుచి అసలు సాటిలేనిది. ముఖ్యంగా సీజన్లో దొరికే ముదురు చింతకాయలు వంటకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఇస్తాయి.
చిన్న చేపలను చింతకాయ పులుసులో వండితే ఆ రుచి వేరే లెవల్లో ఉంటుంది. చింతకాయలోని సహజమైన పులుపు చేప ముక్కకు బాగా పట్టి, తింటుంటే నోటికి భలే రుచిగా అనిపిస్తుంది. దీనికి తోడు రోట్లో దంచిన అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మసాలాను వేస్తే ఆ సువాసన ఇల్లంతా నిండిపోయి ఆకలిని పెంచేస్తుంది.
మొదట చింతకాయలను నీళ్లలో ఉడికించి, పైన పెంకు తీసేసి మెత్తని పులుసును సిద్ధం చేసుకోవాలి. చేపల పులుసుకి మసాలా ఎంత ముఖ్యమో, ఆ పులుపును సరిగ్గా తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇలా తయారు చేసుకున్న చింతకాయ రసం వంటకు అసలైన ప్రాణం పోస్తుంది.
ఉల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకుని నూనెలో వేయించుకోవాలి. అందులో పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం దట్టించిన చేప ముక్కలను వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ పులుసును అందులో పోయాలి. పులుసు మరుగుతున్నప్పుడు రెండు మూడు బెండకాయ ముక్కలు వేస్తే ఆ రుచి మరింత పెరుగుతుంది. చేప ముక్కలు విదిలిపోకుండా జాగ్రత్తగా పది నిమిషాలు ఉడికిస్తే, నూనె పైకి తేలి నోరూరించే పచ్చి చింతకాయ చేపల పులుసు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే ఆ తృప్తే వేరు..