- ఎన్టీఆర్ జిల్లాలో రైతన్న.. మీకోసం కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ..
- పంటల వైవిధ్యీకరణతో రైతుల ఆదాయం పెంపు…
- టెక్నాలజీతో వ్యవసాయంలో కొత్త మార్పులకు శ్రీకారం…
Atchannaidu: రాష్ట్రంలోని ప్రతి రైతు వద్దకే ప్రభుత్వం వెళ్లి లాభసాటి వ్యవసాయం దిశగా మార్గనిర్దేశం చేయడమే లక్ష్యంగా “రైతన్న.. మీకోసం” కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలసి రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక రైతులతో కలసి గ్రామంలో తిరుగుతూ కరపత్రాలను రైతులకు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతన్నా మీకోసం” కార్యక్రమంలో భాగంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచసూత్రాల అమలుతో రాష్ట్ర వ్యవసాయానికి కొత్త ఊపిరి పోస్తున్నామని తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, 62 శాతం జనాభా వ్యవసాయ,అనుబంధ రంగాలపై ఆధారపడిన రాష్ట్రంలో రైతును “రాజు”గా నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు రైతులకు మద్దతుగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా కలుసుకుని క్షేత్రస్థాయిలో లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలో అవగాహన కల్పించడంతో పాటు ప్రతి రైతు సేవా కేంద్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ సాగులో ఉన్న పంటలు, రైతుల వివరాలను సేకరిస్తామని చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతంలో ఏ పంటలు సాగు చేయాలో ముందుగానే సూచనలు అందజేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల అభివృద్ధి కోసం ఐదు ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సుమారు 80 శాతం నీటి నిల్వలు ఉన్నాయని, కాలువల మరమ్మతులు పూర్తి చేసి సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
మార్కెట్లో అధిక ధరలు లభించే పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో పాటు మండవల్లిలో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధరలు పడిపోయినప్పుడు పొగాకు, మామిడి, కోకో, టమోటా, ఉల్లి రైతులకు 588 కోట్ల రూపాయలు ఖర్చుచేసి సుమారు లక్ష మంది రైతులను ప్రభుత్వం ఆదుకుందని, రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని తెలిపారు. గల్ఫ్ లో యుద్ధం కారణంగా ఎగుమతి పంటలైన కొబ్బరి, మొక్కజొన్న, అరటి, వంటి పంటల ధరలు తగ్గాయని వాటి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యాహ్నయ మార్గాలను, మార్కట్లను ఆన్వేషించి రైతులను ఆదుకుంటుందని పేర్కొన్నారు. వ్యవసాయానికి అవసరమైన పలు ఇన్ పుట్ పరికరాల దిగుమతిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాటిని కూడా అధిగమించి రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.20,000 ఆర్థిక సహాయాన్ని మూడు విడతల్లో జమ చేసామని, సీఎం చంద్రబాబు బటన్ నొక్కిన గంటలోనే 99.75 శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని తెలిపారు. మే 15 నుంచే ఖరీఫ్ సీజన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, రిజర్వాయర్లలో నీరు ఉన్న నేపథ్యంలో రెండు నెలల ముందుగానే సాగు మొదలుపెడితే అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోవచ్చని రైతులకు సూచించారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని రైతులకు సూచించారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి ఒక సచివాలయాన్ని సందర్శించి “రైతన్న.. మీకోసం” కార్యక్రమాన్ని ముగిస్తారని మంత్రి తెలిపారు. రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను ప్రోత్సహిస్తూ నీటి వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్ట్పై గతంలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు దాని గొప్పతనాన్ని గుర్తిస్తున్నారని అన్నారు. మారుతున్న ఆహార అలవాట్లు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల వైవిధ్యీకరణ (డైవర్సిఫికేషన్) వైపు వెళ్లాలని సూచించారు. ఏలూరు ప్రాంతంలో పామాయిల్ సాగుతో రైతులు ఎకరాకు మంచి లాభాలు పొందుతున్నారని, కోకో, మిరియాల వంటి పంటల సాగు కూడా విస్తరిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ ధర పామాయిల్కు రాష్ట్రంలో లభిస్తోందని చెప్పారు.
గత ఐదేళ్లలో వ్యవసాయ శాఖను నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో , ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో వ్యవసాయ రంగాన్ని తిరిగి బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికత వినియోగంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్కు ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నూజివీడు ప్రాంతంలో మామిడి పంటకు కవర్లు సబ్సిడీతో అందిస్తున్నామని చెప్పారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు కూడా మార్పు తీసుకురావాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే విధంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని రైతులకు సూచించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రైతులు పనిచేస్తే వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విమర్శలు చేయడం తప్ప వైసీపీకి మరే పని లేదని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవలం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, రైతులు, ఎన్డీయే కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.