Maintenance of Parents Act 2026: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ, వారి బాగోగులు పట్టించుకోని ఉద్యోగుల ఆటకట్టించేందుకు సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 'తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ బిల్లు 2026'కు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను రోడ్డున పడేసే వారికి ఇకపై జీతం నుంచి కోత తప్పదు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఉద్యోగి తన తల్లిదండ్రుల కనీస అవసరాలను తీర్చకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తే, సదరు ఉద్యోగి నెలవారీ జీతంలో 15 శాతం లేదా గరిష్టంగా పది వేల రూపాయలను ప్రభుత్వం కట్ చేస్తుంది. ఇందులో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని నేరుగా బాధితులైన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాకుండా, ఈ చట్టం పరిధిలోకి ప్రజాప్రతినిధులను కూడా చేర్చడం విశేషం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్ల వంటి వారు కూడా తమ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాల్సిందే. ఒకవేళ ఏ కొడుకైనా, కూతురైనా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లిదండ్రులు భావిస్తే, వారు నేరుగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఈ ఫిర్యాదును స్వీకరించి, రెండు నెలల లోపు విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ ఇచ్చే తీర్పుపై అభ్యంతరాలు ఉంటే వయోవృద్ధుల కమిషన్లో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తూ, కనీసం తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులను దైవంగా భావిస్తారని, వారిని గౌరవంగా చూసుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. సామాజిక మార్పు కోసం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిలో భయం తీసుకురావడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
రాజకీయ విశ్లేషకులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఈ చట్టం ద్వారా కుటుంబ వ్యవస్థలో పడిపోతున్న విలువలను కాపాడవచ్చునని భావిస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని వారికి ఈ నిర్ణయం ఒక గుణపాఠం అవుతుందని, సమాజంలో వయోవృద్ధులకు భద్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చట్టం తక్షణమే అమలులోకి రానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.