Andhra Pradesh Education: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు, చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుపై ఒక స్పష్టమైన భరోసా ఇచ్చింది. గత ఐదేళ్లలో విద్యాశాఖలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ, రాబోయే రోజుల్లో ఏపీని చదువుల తల్లికి కేరాఫ్ అడ్రస్గా మార్చాలనే పట్టుదల ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. కేవలం భవనాలు కట్టడమే కాకుండా, విద్యార్థుల్లో నేర్చుకునే సామర్థ్యం లెర్నింగ్ అవుట్ కమ్స్ పెంచడంపైనే ఈ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది.
గత పాలనలో తీసుకువచ్చిన జీవో 117 వల్ల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న తీరును లోకేష్ వివరించారు. ఈ జీవో వల్ల వేల సంఖ్యలో పాఠశాలలు ఏక ఉపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని, దీనివల్ల ప్రాథమిక స్థాయిలో పిల్లల చదువు పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకుల్లో ఉన్న మన రాష్ట్రం, అనాలోచిత నిర్ణయాల వల్ల అక్షరాస్యతలో వెనుకబడిపోవడం బాధాకరమన్నారు. అందుకే ఈ అడ్డంకులను తొలగించి, ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇస్తూ వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు.
ముఖ్యంగా అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుడుతూ స్కూల్ కిట్లు, మధ్యాహ్న భోజన పథకంలో దాదాపు 1000 కోట్ల రూపాయలను ఆదా చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఈ ఆదా చేసిన సొమ్మును తిరిగి పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సౌకర్యాల కోసమే ఖర్చు చేయనున్నారు. అలాగే, యూనివర్సిటీల్లో బంధువుల నియామకాలకు స్వస్తి పలికి, ప్రతిభ ఉన్న వారికే వైస్ ఛాన్సలర్ పదవులు కట్టబెట్టడం ద్వారా ఉన్నత విద్యలో మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధ్యాపక పోస్టుల భర్తీకి ఉన్న న్యాయ చిక్కులను 90 రోజుల్లోగా తొలగించి నోటిఫికేషన్ ఇస్తామని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు.
సాంకేతికతను విద్యతో జోడించడంలో లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. క్లిక్కర్ టెక్నాలజీ, లీప్ యాప్ వంటి అత్యాధునిక విధానాల ద్వారా విద్యార్థుల అభ్యసనను పర్యవేక్షించడం గొప్ప పరిణామం. విద్యార్థి బడికి రాకపోతే గంటలోనే తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లేలా చేయడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది. అలాగే చదువుతో పాటు నైతిక విలువలు నేర్పించడానికి చాగంటి కోటేశ్వరరావు గారి సలహాలు తీసుకోవడం, పాఠ్యాంశాల్లో మార్పులు చేయడం పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది.
ఇది కేవలం ఒక మంత్రి లేదా ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదని, ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లోని స్కూళ్లను దత్తత తీసుకొని పర్యవేక్షించాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రతివారం స్కూళ్లను విజిట్ చేసి సమస్యలను పరిష్కరిస్తే, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు దీటుగా తయారవుతాయి. తల్లికి చెప్పలేని ఏ నిర్ణయమూ తీసుకోకూడదు అన్న చాగంటి గారి మాటను గుర్తు చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు.