- రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా..? కలియుగ దైవాన్ని సభలోకి లాగిన విపక్ష నేతలు..
- సభా సమయం వృధా.. దేవుడి ఫొటోలతో గలాటా: వైసీపీ పక్కా వ్యూహంతోనే వచ్చిందా?
YCP MLCs Comments On TTD: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రాజకీయ పోరాటాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం, సభలో స్వామివారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా దిగజారుతామని వైసీపీ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. అత్యున్నతమైన శాసనమండలిలో ప్రజల సమస్యలపై చర్చించాల్సింది పోయి, దేవుడిని అడ్డం పెట్టుకుని హంగామా చేయడం భక్తులను విస్మయానికి గురిచేసింది.
దేవుడంటే ఏమాత్రం గౌరవం లేకుండా, అత్యంత హేయమైన రీతిలో వైసీపీ సభ్యులు సభలో వ్యవహరించారు. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికే అపరాధం చేసేలా వారి చర్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ సంఘటనలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏమిటంటే.. వైసీపీ సభ్యులు అనుసరించిన నిరసన తీరు. సాధారణంగా మనం ఇంట్లో దేవుడి ఫొటోను తాకాలన్నా చెప్పులు విడిచి వెళ్తాం. కానీ, వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం కాళ్లకు చెప్పులు, షూలు వేసుకుని, చేతులతో స్వామివారి చిత్రపటాలను పట్టుకుని నినాదాలు చేస్తూ మండలిలోకి రావడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరచడమే.
భక్తిని చాటుకోవాల్సిన చోట, షూలు వేసుకుని దేవుడి ఫొటోలతో గలాటా చేయడం వారి వికృత రాజకీయాలకు పరాకాష్ట అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలిలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా, సభ ఆర్డర్లో ఉండకుండా చేసేందుకు వైసీపీ ఒక పక్కా వ్యూహంతో వచ్చినట్లు కనిపిస్తోంది. "దేవుడితో ఆటలు వద్దు.. స్వామివారిని రాజకీయాల్లోకి లాగకండి" అని మంత్రులు పదేపదే సూచిస్తున్నా, వైసీపీ సభ్యులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఛైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లి రభస చేయడం, మంత్రులు మాట్లాడుతున్నా వినకుండా అడ్డుపడటం ద్వారా సభా సమయాన్ని వృధా చేశారు.
వైసీపీ నేతల భక్తి ఎంతటిదో సభ వాయిదా పడిన తర్వాత స్పష్టమైంది. అప్పటిదాకా నిరసన పేరుతో హడావుడి చేసిన సభ్యులు, మండలి వాయిదా పడగానే తమ వెంట తెచ్చిన శ్రీవారి ఫొటోలను కనీస మర్యాద లేకుండా టేబుళ్లపై విసిరేసి వెళ్ళిపోయారు. ఈ దృశ్యం చూసిన భక్తులు, "మీకు దేవుడి మీద భక్తి ఉంటే అలా వదిలేస్తారా? ఇది కేవలం రాజకీయ నాటకం కాదా?" అని ప్రశ్నిస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు దేవుడిని వాడుకోవడం, పని పూర్తి కాగానే వదిలేయడం వైసీపీ వికృత ధోరణికి అద్దం పడుతోందని భక్తులు మండిపడుతున్నారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ దైవత్వాన్ని అపహాస్యం చేయడం ఏమాత్రం క్షమించరాని నేరం. హిందూ సమాజాన్ని, వేంకటేశ్వర స్వామి భక్తులను ఘోరంగా అవమానించిన వైసీపీ నేతలకు భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెబుతారని భక్తులు హెచ్చరిస్తున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగే సంస్కృతి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు.