PM Modi CMs Meeting: పశ్చిమాసియా లో మారుతున్న రాజకీయ పరిణామాలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం భారతదేశంపై పడకుండా ఉండేందుకు, భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (శుక్రవారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో దేశ భద్రత, ఇంధన నిల్వలు ఆర్థిక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అస్థిరత వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్, పెట్రోల్ డీజిల్ సరఫరాలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ యుద్ధం ముదిరితే, చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన నిల్వలను ఎలా సమన్వయం చేసుకోవాలి, సామాన్యులపై భారం పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రధాని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇటీవలే పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడిన ప్రధాని మోదీ, దేశ ప్రజలు ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవని, దీర్ఘకాలిక ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని, నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడాలని కోరారు. దౌత్యపరంగా శాంతి కోసం భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ, అంతర్గతంగా మనం సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో చర్చించబోయే మరో ముఖ్య అంశం.. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రత. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. ఒకవేళ పరిస్థితులు విషమిస్తే వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లపై కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోనుంది. విదేశాంగ శాఖ ఇప్పటికే ఆయా దేశాల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. దీనికి సంబంధించి రాష్ట్రాల వారీగా ఉన్న గణాంకాలను, సాయం అందించే పద్ధతులను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది.
యుద్ధం కారణంగా దిగుమతులు తగ్గితే ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ధరల నియంత్రణపై ప్రత్యేక నిఘా ఉంచాలని మోదీ కోరనున్నారు. రేపు జరగబోయే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని చేసే ప్రసంగం తీసుకునే నిర్ణయాలు దేశ భవిష్యత్తు ఆర్థిక స్థితిగతులను నిర్దేశించనున్నాయి. అందుకే ఈ సమావేశంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.