Indian Cricket News: భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది (2026-27) మన సొంత గడ్డపై జరగబోయే భారీ క్రికెట్ పండగకు సంబంధించిన షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేలతో పాటు ఆస్ట్రేలియా జట్లు భారత్లో పర్యటించనున్నాయి. మొత్తం 17 నగరాల్లో, 22 అంతర్జాతీయ మ్యాచ్లు జరగనుండటంతో దేశవ్యాప్తంగా క్రికెట్ సందడి నెలకొననుంది. ఇందులో 5 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఉండటం విశేషం.
వెస్టిండీస్తో జరిగే వైట్-బాల్ సిరీస్తో ఈ సీజన్ గ్రాండ్గా మొదలవుతుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ పోరులో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఉంటాయి. తిరువనంతపురం, లక్నో, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు ఈ మ్యాచ్లకు వేదిక కానున్నాయి. విండీస్ పవర్ఫుల్ హిట్టర్లను ఎదుర్కోవడానికి టీమిండియా కుర్రాళ్లు సిద్ధమవుతున్నారు.
ఆ తర్వాత డిసెంబర్లో పొరుగు దేశం శ్రీలంక మన గడ్డపై అడుగుపెట్టనుంది. డిసెంబర్ 13 నుంచి 27 వరకు జరిగే ఈ పర్యటనలో చెరో మూడు వన్డేలు, టీ20లు జరుగుతాయి. ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి స్టేడియాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక కొత్త ఏడాది 2027 ప్రారంభంలో జింబాబ్వే జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకోవడానికి ఈ సిరీస్ ఒక మంచి వేదికగా మారనుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక 'బోర్డర్-గావస్కర్ ట్రోఫీ జనవరి 21 నుంచి మార్చి 3 వరకు ఐదు టెస్టుల పాటు సాగే ఈ సమరం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేయనుంది. నాగ్పూర్, చెన్నై, గువహటి, రాంచీ, అహ్మదాబాద్ నగరాల్లో ఈ టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆసీస్ బౌలర్లను మన బ్యాటర్లు ఎలా తట్టుకుంటారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాబోయే హోమ్ సీజన్ టీమిండియాకు బిజీగా ఉండటమే కాకుండా, అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచనుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా మ్యాచ్లు ఉండటం తెలుగు క్రికెట్ ఫ్యాన్స్కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ భారీ షెడ్యూల్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన స్టేడియాలు హోరెత్తనున్నాయి.