Andhra Pradesh News: రాజకీయాల్లో (Political) హామీలు ఇవ్వడం అందరూ చేసే పనే కానీ వాటిని తు.చ తప్పకుండా అమలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన ఒక పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతేడాది రంజాన్ సమయంలో ఒక పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చి, వారి సొంతింటి కలను నిజం చేయడంతో లోకేష్పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.
గతేడాది రంజాన్ పండుగ సందర్భంగా లోకేష్ ఒక పేద ముస్లిం కుటుంబం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వెళ్లారు. అక్కడ ఆ కుటుంబం ఉంటున్న శిథిలావస్థకు చేరిన ఇంటిని చూసి ఆయన చలించిపోయారు. ఆ సమయంలోనే వారికి సొంత ఇల్లు కట్టించి ఇస్తానని మాటిచ్చారు. అన్నట్టుగానే, ఏడాది తిరగకముందే అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త ఇంటిని నిర్మించి ఆ కుటుంబానికి అందించారు. పండుగ పూట తమకు ఇంతటి గొప్ప బహుమతి లభించడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు.
లోకేష్ చేసిన ఈ పనిపై ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ప్రత్యేకంగా స్పందించారు. దేశంలో మతపరమైన విభజన రాజకీయాలు నడుస్తున్న ఈ తరుణంలో, మతాలకు అతీతంగా ఒక నాయకుడు ఇలా మానవత్వాన్ని చాటుకోవడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. లోకేష్ తన హామీని నెరవేర్చిన తీరుపై రాజ్దీప్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం ఒక ఇల్లు కట్టించడం మాత్రమే కాదని, సమాజంలో మత సామరస్యానికి ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ 'ఇండియా టుడే' కూడా ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను మర్చిపోతుంటారని, కానీ లోకేష్ మాత్రం బాధ్యతగా గుర్తుపెట్టుకుని పేదల కష్టాన్ని తీర్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీల పట్ల లోకేష్ చూపిస్తున్న ఈ ఆత్మీయత, సానుకూల రాజకీయాలకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు.
#PromiseMadePromiseFulfilled అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. దేశవ్యాప్తంగా నెటిజన్లు లోకేష్ చేసిన ఈ పనిని అభినందిస్తున్నారు. ఇచ్చిన మాట తప్పని నైజం ఉంటే ప్రజల్లో ఇలాంటి గుర్తింపు దక్కుతుందని ఈ ఘటన నిరూపించింది. రంజాన్ పండుగ వేళ ఆ ముస్లిం కుటుంబం కళ్లలో కనిపిస్తున్న ఆనందమే లోకేష్ విజయానికి నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.