నేడు ఏపీ రాష్ట్ర పండుగగా భగీరథ మహార్షి జయంతి..
గంగను దివి నుంచి భువికి తెచ్చిన మహానీయుడు భగీరథుడు..
రాష్ట్రంలో జల సంరక్షణను భగీరథ మహర్షి స్ఫూర్తితో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులు అమలు అవుతున్నాయని ఆమె చెప్పారు.
భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి సవిత ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గంగను భూమికి తీసుకురావడానికి భగీరథుడు చేసిన కఠోర తపస్సు అపూర్వమని ఆమె కొనియాడారు. సగరుల కులదైవమైన భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.
భగీరథుని పట్టుదల, సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జల సంరక్షణకు పెద్ద ఉద్యమం చేపట్టారని మంత్రి తెలిపారు. పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
రాయలసీమలో సాగునీటి అభివృద్ధికి 2014–19 మధ్య రూ.12,441 కోట్లు ఖర్చు చేసినట్లు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.6,613 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రూ.3,870 కోట్లతో కృష్ణా జలాలను మడకశిర, కుప్పం ప్రాంతాలకు తీసుకువచ్చినట్లు వివరించారు.
వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయి సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, తాగునీటి సమస్యల పరిష్కారానికి ‘జలధార’ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి చెప్పారు. నీటితోనే అభివృద్ధి సాధ్యమనే సీఎం చంద్రబాబు నమ్మకం రాష్ట్రానికి మార్గదర్శకమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు నందు అబద్ధయ్య, వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.