- గోదావరి పుష్కరాలు - 2027 నేపథ్యంలో పరిపాలన అనుమతులు జారీ చేసిన దేవాదాయ శాఖ..
- 4-5 నెలల ముందే పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా..
Godavari Pushkaralu: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో నిడదవోలు నియోజకవర్ నిడదవోలు రూరల్ మండలంలోని సమిశ్రగూడెం శ్రీ పర్వత వర్థిని రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి మార్గం సుగమమైంది. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఉమ్మడి ప్రయోజన నిధి('కామన్ గుడ్స్ ఫండ్') క్రింద ఈ దేవాలయ పునర్నిర్మాణం కోసం రూ. 1.25 కోట్ల నిధులను మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది.
పుష్కర యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు:
రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో దేశవ్యాప్తంగా భక్తులు రాజమహేంద్రవరం మరియు పరిసర ప్రాంతాల్లోని పవిత్ర గోదావరి తీరానికి తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులు స్నానం ఆచరించిన అనంతరం నదీ తీరంలోని పురాతన దేవాలయాలను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, దేవాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికల ఆధారంగా, అత్యంత ప్రాధాన్యత కలిగిన సమిశ్రగూడెం ఆలయ పునరుద్ధరణ మరియు ఫేస్లిఫ్ట్ పనుల కోసం మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరితగతిన నిధులు మంజూరు చేయించారు.
సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశం:
నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన నియోజకవర్గ ప్రజలు మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. "పుష్కరాల నాటికి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా ఆలయ రూపురేఖలు మార్చడమే మా లక్ష్యం. నిర్మాణ పనులను పుష్కరాల కంటే 4-5 నెలల ముందే పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి" అని ఆదేశించారు.