- కడప జిల్లాలోని పలు ప్రాంతాలకు..
- సొంత జిల్లా అయిన కడపకు కూడా..
Nimmala Comments On Jagan: రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులు కుంటుపడ్డాయని, సీమ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు.
వైసీపీ నేతలకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) స్టే ఇచ్చింది 2020 సెప్టెంబర్ నెలలో అని మంత్రి గుర్తు చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్ మోహన్ రెడ్డి అన్న విషయం వైసీపీ సభ్యులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. 2020లోనే ఈ పనులు నిలిచిపోయాయని, అప్పటి నుంచి 2024 వరకు ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం తన చేతగానితనంతో పనులను మధ్యలోనే వదిలేసిందని మండిపడ్డారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేవలం తాగునీటి అవసరాల కోసమే చేపడుతున్నట్లు 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం స్వయంగా జీవో నంబర్ 366 జారీ చేసిందని నిమ్మల రామానాయుడు బయటపెట్టారు. సాగునీటి కోసం కాకుండా కేవలం తాగునీటి కోసమేనని చెప్పి సీమ రైతుల పొట్ట కొట్టారని ఆరోపించారు. గత ఐదేళ్లలో రాయలసీమకు ఒక్క చుక్క అదనపు నీటిని కూడా తీసుకురాలేకపోయారని, కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు.
సొంత జిల్లా అయిన కడపకు కూడా జగన్ ఏమీ చేయలేదని మంత్రి విమర్శించారు. చిత్రావతి రిజర్వాయర్ నిండితేనే పులివెందుల సహా కడప జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని, అయితే గత ఐదేళ్లలో అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. పులివెందుల నీటి అవసరాలను కూడా పట్టించుకోని వ్యక్తి, రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
రాయలసీమకు నిజంగా న్యాయం చేసింది ఎవరో, ద్రోహం చేసింది ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుసని మంత్రి నిమ్మల అన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని తుడిచిపెట్టే ప్రయత్నం చేశారని, ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని విమర్శించారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, చేతల్లో అభివృద్ధి చూపించాలని నిమ్మల సూచించారు.