LPG Subsidy News: ప్రస్తుత కాలంలో సామాన్యుడి బడ్జెట్ను అతలాకుతలం చేస్తున్న అంశాల్లో వంట గ్యాస్ ధరలు ప్రధానమైనవి. అయితే, పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. గృహ అవసరాలకు వాడే ఎల్పిజి (LPG), అలాగే పైపుల ద్వారా సరఫరా అయ్యే పిఎన్జీ (PNG)పై ఉన్న పన్నులను తగ్గించాలని లేదా పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
పన్నుల భారం తగ్గితేనే ఊరట
ప్రస్తుతం వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీన్ని గనుక తొలగిస్తే, వ్యాపారస్తులకు ఒక్కో సిలిండర్పై సుమారు రూ. 317 వరకు మేలు జరుగుతుంది. దీని ప్రభావం హోటల్ ధరలు, ఇతర ఆహార పదార్థాల ధరలపై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు, ఇళ్లలో వాడుకునే గృహ వినియోగ సిలిండర్లపై ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ పన్నును రద్దు చేస్తే, సిలిండర్ ధరలో సుమారు రూ. 43 తగ్గుతుంది. దీనికి తోడు, ఇటీవల పెరిగిన అదనపు ధరలను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంటే, సామాన్యుడికి మొత్తం మీద రూ. 100 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగి, ఆ భారం చివరకు దేశీయ వినియోగదారులపై పడుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రమే చొరవ తీసుకుని పన్ను మినహాయింపులు ఇస్తే తప్ప, సామాన్యుడికి ఉపశమనం లభించదు. అందుకే, 'చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ' (CTI) వంటి సంస్థలు ప్రధాని మోదీకి ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి.
రాష్టాల పన్నుల గోల
పీఎన్జీ (PNG) గ్యాస్ విషయానికి వస్తే, ఇది ఇంకా జీఎస్టీ పరిధిలోకి రాలేదు. దీనివల్ల వివిధ రాష్ట్రాలు తమ ఇష్టానుసారం వ్యాట్ (VAT) విధిస్తున్నాయి. ఈ పన్నుల వల్ల గ్యాస్ ధరలు భారీగా మారుతున్నాయి. దీన్ని కూడా ఒకే పన్ను పరిధిలోకి తీసుకురావాలని లేదా పన్నులు తగ్గించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే, పెరుగుతున్న నిత్యావసర ధరల మధ్య ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారుతుంది. అయితే, తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.