Political: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు 'ఇప్ప సారా' అంశం హాట్ టాపిక్ గా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. గతంలో గిరిజన ప్రాంతాల్లో లభించే స్వచ్ఛమైన ఇప్ప సారాను తాగిన వారు 100 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న విదేశీ మద్యం వల్ల యువత 60 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే పాత పద్ధతిలో ఇప్ప సారా అమ్మకాలను మళ్లీ ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
గిరిజన సంస్కృతిలో ఇప్ప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్ప పువ్వుతో తయారు చేసే మద్యం కేవలం మత్తు కోసమే కాకుండా, ఒకప్పుడు ఔషధంగా కూడా వాడేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే, కాలక్రమేణా నాటు సారాలో రసాయనాలు కలపడం, కల్తీ పెరిగిపోవడంతో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలో కేవలం మద్యం మాత్రమే కాకుండా, ఇప్ప పువ్వుతో లడ్డూలు, బిస్కెట్లు, కేకులు వంటి పోషక ఆహార పదార్థాలను తయారు చేసే కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని సూచించడం విశేషం. దీనివల్ల ఆదివాసీలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఇప్ప సారా తాగితే నిజంగానే 100 ఏళ్ల ఆయుష్షు పెరుగుతుందా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం.. ఇప్ప పువ్వులో క్యాల్షియం, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ వంటి మంచి పోషకాలు ఉంటాయి. కానీ అది మద్యం (సారా) రూపంలోకి మారినప్పుడు దాని లక్షణాలు మారిపోతాయి. అతిగా మద్యం సేవించడం వల్ల లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పాతకాలం వారు ఎక్కువ కాలం బతకడానికి కేవలం సారా మాత్రమే కారణం కాదని, వారు తీసుకునే కల్తీ లేని ఆహారం, కష్టపడి పనిచేసే తత్వం, స్వచ్ఛమైన గాలి కూడా ప్రధాన కారణాలని విశ్లేషిస్తున్నారు.
ఇప్ప పువ్వులోని మంచిని గుర్తించి ఇప్పటికే కొందరు మహిళలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన మహిళలు ఇప్ప పువ్వుతో లడ్డూలు తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ లడ్డూలు రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఎంతో మేలు చేస్తున్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ గిరిజన మహిళల చొరవను గతంలో మెచ్చుకున్నారు. ఇలాంటి పోషక విలువలున్న ఉత్పత్తులను ప్రోత్సహిస్తే అటు ఆరోగ్యం, ఇటు గిరిజనులకు ఆదాయం రెండూ దక్కుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్ప సారా పునరుద్ధరణ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవైపు గిరిజన ఆర్థికాభివృద్ధి, మరోవైపు ప్రజల ఆరోగ్యం.. ఈ రెండింటినీ బేరీజు వేయాల్సిన అవసరం ఉంది. ఆధునిక పద్ధతుల్లో కల్తీ లేని ఇప్ప ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కేవలం మత్తు పదార్థంగానే కాకుండా, ఇప్ప పువ్వును ఒక విలువైన అటవీ సంపదగా గుర్తించి పరిశోధనలు చేస్తే భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల రూపురేఖలు మారే అవకాశం ఉంది.