Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన కోర్టు విచారణ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో అనధికారికంగా చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలను వెంటనే తొలగించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు పరిపాలనా విభాగం ఆదేశించింది. కోర్టు నిబంధనలను ఉల్లంఘించి ఈ దృశ్యాలను రికార్డు చేయడంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది.
మద్యం పాలసీ కేసులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందు కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించిన సమయంలో ఈ వీడియోలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతి లేకుండా విచారణను రికార్డు చేయడం లేదా బయట వ్యక్తులతో పంచుకోవడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్చువల్ విచారణలకు సంబంధించి హైకోర్టులో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, వాటిని ఎవరూ అతిక్రమించకూడదని పేర్కొన్నారు.
మరోవైపు, ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాజకీయ నాయకులపై కూడా ఫిర్యాదులు అందాయి. ఏప్రిల్ 13న జరిగిన విచారణలో కేజ్రీవాల్ స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ఆ సమయంలో కొన్ని ఆడియో, వీడియో క్లిప్పులను కావాలనే రికార్డు చేసి, తప్పుడు ప్రచారం కోసం వాడుతున్నారని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు ఒక ఫిర్యాదు అందింది. దీనివల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని ఫిర్యాదుదారు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయస్థానం ప్రతిష్టను మసకబార్చేలా కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. కోర్టు విచారణలను తప్పుగా చిత్రీకరించేలా వ్యాఖ్యలు జోడించి షేర్ చేయడంపై విచారణ జరపాలని ఆదేశాలు వెలువడ్డాయి. 2021 మరియు 2025లో రూపొందించిన వీడియో కాన్ఫరెన్సింగ్ నిబంధనల ప్రకారం.. ఇలాంటి పనులు తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హైకోర్టు కఠినంగా వ్యవహరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల నుండి ఈ వీడియోలను తొలగించే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు సూచించారు.