నవ మాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చే తల్లుల ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాతృ మరణాల రేటును తగ్గించడమే కాకుండా, పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం ప్రసవం తర్వాత బాలింతలకు మాత్రమే పరిమితమైన ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ (FCM) ఇంజెక్షన్లను, ఇకపై గర్భిణీలకు కూడా పూర్తిగా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే
అతిపెద్ద సమస్య ‘ఎనీమియా’ లేదా రక్తహీనత. ఇది కేవలం తల్లి ప్రాణాలకే కాకుండా, గర్భంలోని శిశువు ఎదుగుదలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఆహారం లేదా ఐరన్ టాబ్లెట్ల ద్వారా రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈ ‘ఎఫ్సీఎం’ ఇంజెక్షన్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే హీమోగ్లోబిన్ స్థాయిలు 2 నుంచి 3 శాతం వరకు వేగంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా రక్తంలో హీమోగ్లోబిన్ 10 గ్రాముల కంటే తక్కువగా ఉన్న గర్భిణీలకు ఈ ఇంజెక్షన్ ఒక సంజీవనిలా పనిచేయనుంది.
ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆరోగ్య శాఖ ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలింతల కోసం 53,500 ఇంజెక్షన్లను ఇప్పటికే జిల్లాలకు సరఫరా చేయగా, గర్భిణీలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి అందిన మరో 18,500 ఇంజెక్షన్లను కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు (CHC): 80 ఇంజెక్షన్లు
ఏరియా ఆసుపత్రులకు: 175 ఇంజెక్షన్లు
జిల్లా ఆసుపత్రులకు: 400 చొప్పున స్టాక్ను సిద్ధం చేశారు.
వైద్యంతో పాటు రవాణా సౌకర్యాన్ని కూడా మెరుగుపరచడంలో కూటమి సర్కార్ చురుగ్గా వ్యవహరిస్తోంది. గతంలో నిలిచిపోయిన ‘తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలను తిరిగి పునరుద్ధరించడం గర్భిణీలకు పెద్ద ఊరటనిస్తోంది. ఆసుపత్రికి వెళ్లడం నుంచి, ప్రసవం తర్వాత తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చే వరకు ఈ ఉచిత రవాణా సేవలు అందుబాటులో ఉంటాయి.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు మారుమూల గ్రామాలలోని పేద మహిళలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఖరీదైన ఇంజెక్షన్లను ఉచితంగా అందించడం ద్వారా ప్రభుత్వం సామాన్యుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించే దిశగా బలమైన పునాది వేస్తోంది. త్వరలోనే ఈ ఇంజెక్షన్ల పంపిణీపై జిల్లాల వారీగా పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి