- లోకేష్ ఘాటుగా స్పందిస్తూ.. నిజాలు చేదుగా ఉంటాయి కాబట్టే.!
- తమ ప్రభుత్వం రాగానే ఇంటర్ విద్యార్థులకు..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల చదువులకు సంబంధించిన ఫీజులను చెల్లించకుండా కోట్లాది రూపాయల బకాయిలు పెట్టి వెళ్లారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సభలో చర్చకు రావాలని, అబద్ధపు ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని హితవు పలికారు.
మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, గత ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి లోకేష్ లెక్కలతో సహా ఎండగట్టారు. వైసీపీ పాలనలో అక్షరాలా రూ. 4064.59 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బకాయిల వివరాలను వివరిస్తూ.. 2020-21 సంవత్సరానికి సంబంధించి రూ. 683.1 కోట్లు, అలాగే 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ క్వార్టర్లకు సంబంధించి సుమారు రూ. 1753 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీటికి తోడు మెయింటెనెన్స్ ఫీజు (MTF) కింద మరో రూ. 895 కోట్లు చెల్లించలేదని చెప్పారు.
ప్రభుత్వం మారే సమయానికి కూడా రూ. 645 కోట్లు అప్పగించకుండా వెళ్లిపోయారని, ఇవన్నీ రికార్డుల్లో ఉన్న సత్యాలని ఆయన సభలో నిలదీశారు. తాను విద్యాశాఖ మంత్రిగా ఈ వాస్తవాలను బయటపెట్టే హక్కు తనకు ఉందని, ఈ లెక్కలను సభ ముందు ఉంచుతానని సవాల్ విసిరారు. మంత్రి లోకేష్ విమర్శలపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. తమ హయాంలో అన్ని బకాయిలు లేవని, కేవలం రెండు వాయిదాలు మాత్రమే ఉన్నాయని వాదించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇంటర్ విద్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, తమ నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
దీనిపై లోకేష్ ఘాటుగా స్పందిస్తూ.. నిజాలు చేదుగా ఉంటాయి కాబట్టే వైసీపీ నేతలు పారిపోతున్నారు. వాకౌట్ చేయడం వారికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ తలుపు నుంచి బయటకు వెళ్లి, హాయిగా టీ తాగి మళ్ళీ మరో తలుపు నుంచి లోపలికి వస్తారు. వీరికి ప్రజల సమస్యల మీద కంటే డ్రామాల మీద ఎక్కువ ఆసక్తి ఉంది అని ఎద్దేవా చేశారు. ఇంటర్ విద్యపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలను లోకేష్ తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏకంగా 70 వేల మంది విద్యార్థులు పెరిగారని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కనీసం విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు కూడా సరిగ్గా ఇవ్వలేదని, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అటకెక్కించారని మండిపడ్డారు.
కానీ తమ ప్రభుత్వం రాగానే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించామని, టెన్త్ మరియు ఇంటర్ పిల్లల కోసం 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామని వివరించారు. వైసీపీ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరం కావడం వారి వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. చివరగా, రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజల ప్రభుత్వమని, గతంలో లాగా పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి ఇప్పుడు లేరని లోకేష్ అన్నారు.