- cinema: మంగ్లీ ఫిర్యాదుతో రంగంలోకి సీపీ సజ్జనార్: వేధింపులపై కఠిన చర్యలకు విన్నపం..
- మంగ్లీ వర్సెస్ సుబ్బారావు: ముదురుతున్న వివాదం.. పోలీసుల దర్యాప్తు వేగవంతం..
Singer Mangli: ప్రముఖ సినీ గాయని మంగ్లీ మరియు న్యాయవాది సుబ్బారావు మధ్య నెలకొన్న వివాదం మరో మలుపు తిరిగింది. మైక్రోఫైనాన్స్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో తనపై సాగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ మంగ్లీ మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. తాను కానీ, తన తమ్ముడు కానీ ఎలాంటి ఆర్థిక మోసాలకు పాల్పడలేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. కేవలం తన ప్రతిష్టను దిగజార్చేందుకే సుబ్బారావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కమిషనర్ను కోరారు. అదే సమయంలో, ఈ స్కామ్లో నిజంగా మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని, అసలు దోషులు ఎవరో తేల్చాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
గత నెల 22వ తేదీన సుబ్బారావు తనను కలిసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారని మంగ్లీ సంచలన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తనపై ఉన్న వ్యతిరేక వీడియోలను తొలగించాలంటే పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారని, అందుకు తాను అంగీకరించకపోవడంతోనే కక్షపూరితంగా ఇదంతా చేస్తున్నారని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో డబ్బుల కట్టలతో ఉన్న వ్యక్తి తన తమ్ముడు కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తనకు పాటలు పాడటం తప్ప మరే ఇతర వ్యాపారాలు లేవని, ఈ వ్యవహారంలో తన తప్పు ఉందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆమె సవాల్ విసిరారు. కేవలం ప్రాచుర్యం కోసమే సుబ్బారావు తన పేరును వాడుకుంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు.
మరోవైపు, ఈ వివాదంలో సుబ్బారావు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బాధితులతో కలిసి ఆయన నిరసన తెలిపిన సమయంలో పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో 27 ఎంజీ రీడింగ్ రావడంతో, ఆయన మద్యం సేవించి స్టేషన్లో హంగామా చేసినట్లు తేలిందని సమాచారం. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి స్టేషన్లో మద్యం సేవించి ప్రవర్తించిన తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.