నోరూరించే రొయ్యల పచ్చడి…
ఐదు నెలల పాటు నిల్వ ఉండేలా…
పక్కా కొలతలతో అదిరిపోయే టేస్ట్ మీకోసం.
వేడి వేడి అన్నంలో రొయ్యల పచ్చడి…
Royyala Pacchadi Making Process: మాంసాహార ప్రియులకు చికెన్, మటన్ అంటే ఎంత ఇష్టమో, రొయ్యల పచ్చడి అంటే అంతకు మించిన క్రేజ్ ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం రొయ్యల పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే చాలామందికి ఇంట్లో పచ్చడి పడితే పాడైపోతుందేమో అన్న భయం ఉంటుంది. అలాంటి వారి కోసం, ఐదు నెలల పాటు నిల్వ ఉండేలా, అదిరిపోయే టేస్ట్తో రొయ్యల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ నుండి ఒక కేజీ రొయ్యలు తెస్తే అవి వలిచిన తర్వాత కేవలం అరకేజీ మాత్రమే వస్తాయి. కాబట్టి మీకు ఒక కేజీ రొయ్యల ముక్కలు కావాలంటే, రెండు కిలోల రొయ్యలను కొనుగోలు చేయాలి. వీటిని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
మొదటగా కడిగిన రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు కలిపి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత బాండీలో వేసి రొయ్యల్లోని నీరంతా ఆవిరైపోయే వరకు వేయించాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే రొయ్యల్లో చుక్క నీరు కూడా ఉండకూడదు.పచ్చడికి అసలైన రుచిని ఇచ్చేది మసాలా పొడినే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.
కడాయిలో సుమారు 400 ml పల్లీల నూనె తీసుకోవాలి. పచ్చళ్లకు పల్లీ నూనె వాడితేనే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ నూనెలో రొయ్యలను 85% వరకు డీప్ ఫ్రై చేయాలి. మరీ గట్టిగా వేయించకూడదు. రొయ్యలు తీశాక అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. చివరగా ఉప్పు, కారం, మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలపాలి. మసాలా వేసిన వెంటనే స్టవ్ ఆపేయడం ముఖ్యం.
పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నాలుగు పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని కలపాలి. పచ్చడి పైన నూనె ఎప్పుడూ తేలుతూ ఉండాలి, లేదంటే బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఈ పచ్చడి చేసిన రోజు కంటే రెండు రోజుల తర్వాత ఊరితేనే అసలైన రుచి వస్తుంది.
ఏది ఏమైనా, పక్కా కొలతలతో చేసుకుంటే ఈ రొయ్యల పచ్చడి ఇంటిల్లిపాదికీ ఇష్టమైన వంటకంగా మారిపోవడంలో సందేహం లేదు సుమీ.