నదుల అనుసంధానంతోనే నీటి భద్రత..
స్వర్ణాంధ్ర విజన్లో జలవనరులకు ప్రాధాన్యత.
జూలైలో వెలిగొండ మొదటి దశ పూర్తి..
Blue Print on Irritation Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి, తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని జలవనరుల వినియోగంపై త్వరలోనే ఒక సమగ్రమైన ప్రణాళికను (Blue Print) విడుదల చేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆయన ఆరోపించారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నీటి భద్రత కల్పించి, రాయలసీమను రతనాల సీమగా, కోస్తాను సస్యశ్యామలంగా మారుస్తామని భరోసా ఇచ్చారు.
రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సాగునీటి విడుదలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను కాపాడుకోవడానికి పంట కాలాన్ని ముందుకు జరపాలని, అందుకోసం మే 15వ తేదీ నాటికే నారుమళ్లకు నీరు విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గోదావరి నది నుండి ఏటా సుమారు 3 వేల టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, వంశధార నుండి పెన్నా వరకు నదులను అనుసంధానించడం ద్వారా ఈ నీటిని పొదుపు చేయవచ్చని వివరించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ గత తెలుగుదేశం హయాంలోనే పురుడు పోసుకున్నాయని, వాటిని పూర్తి చేసే బాధ్యతను కూడా తమ ప్రభుత్వమే తీసుకుంటుందని అన్నారు.
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం డయాఫ్రాం వాల్ దెబ్బతిందని, ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వచ్చే పుష్కరాల నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత పాలకులు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని, నీళ్లు రాకుండానే రిబ్బన్ కట్ చేసి ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. జూలై నాటికి వెలిగొండ మొదటి దశ పూర్తి చేసి నీళ్లు విడుదల చేస్తామని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి పెండింగ్ ప్రాజెక్టులకు రూ. 2 వేల కోట్లు కేటాయించి దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
నీటి భద్రత (Water Security) అనేది కేవలం సాగునీటికే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి కూడా అత్యంత కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా పది సూత్రాలను రూపొందించామని, అందులో నీటి నిర్వహణకు అగ్రతాంబూలం ఇచ్చామన్నారు. భూగర్భ జలాల పెంపునకు తీసుకున్న చర్యల వల్ల సగటున 6 మీటర్ల మేర నీటి మట్టం పెరిగిందని, దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గి రూ. 91 కోట్ల మేర ఆదా అయిందని గణాంకాలతో వివరించారు. సూక్ష్మ సాగునీటి (Micro Irrigation) విధానంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో 50 శాతం గ్రీన్ కవర్ను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
పొరుగు రాష్ట్రాలతో జలవివాదాల పట్ల ముఖ్యమంత్రి స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. పోలవరం - నల్లమల సాగర్ అనుసంధానం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం లేదని, కేవలం సముద్రంలో కలిసే వరద నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులను చేపట్టామని, దీనిపై అభ్యంతరాలు అవసరం లేదని అన్నారు. రాజకీయాల కోసం నీటి సమస్యలను సృష్టించవద్దని కోరుతూ, ప్రతి ఇంటికి తాగునీరు మరియు ప్రతి ఎకరాకు సాగునీరు అందించే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ముగించారు.