కోటి మందితో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం..
అమరావతిలో 25 వేల మందితో మెగా యోగా కార్యక్రమం.. సీఎం చంద్రబాబు హాజరు..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది “యోగాంధ్ర-2026” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. జూన్ 7 నుంచి 20వ తేదీ వరకు రెండు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో కోటి మందికి పైగా ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ఈసారి “యోగా ఫర్ హెల్తీ ఏజింగ్” అనే నినాదంతో యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాను కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, మత్స్యకారులు, గిరిజనులు, విద్యార్థులు, యువజన సంఘాలు, ఆటో-లారీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఇలా సమాజంలోని అన్ని వర్గాలను యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములను చేయనున్నారు.
జూన్ 21న అమరావతిలోని కృష్ణా నదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననుండగా, సుమారు 25 వేల మంది హాజరుకానున్నారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా భారీ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో యోగా ప్రచారాన్ని మరింత విస్తరించేందుకు “ఏపీ యోగా ప్రచార పరిషత్” ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని మంత్రి వెల్లడించారు. త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు. ఈ పరిషత్ ద్వారా యోగాను నిరంతర కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు మూడు ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గత ఏడాది నిర్వహించిన యోగా కార్యక్రమాలకు రెండు గిన్నిస్ బుక్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు, ఒక స్కోచ్ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఈసారి 2.5 లక్షల మంది యోగా శిక్షకుల ద్వారా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ఏడాది 1.5 లక్షల మంది శిక్షకులు పాల్గొనగా, ఈసారి మరో లక్ష మందిని అదనంగా చేర్చారు.
యోగాసనాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రత్యేక “వార్ రూం” ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించనున్నారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 28 ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, కోనసీమ జిల్లాలో రైతులతో, కృష్ణా జిల్లాలో ఆటో-లారీ సంఘాలతో, తిరుపతిలో సెలబ్రిటీలతో, విశాఖపట్నంలో మాజీ సైనికులతో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. గుంటూరులో ఉండవల్లి గుహలు, మంగళగిరి ఆలయం, నంద్యాలలో శ్రీశైలం, మహానంది, నెల్లూరులో మైపాడు బీచ్, స్వర్ణాల చెరువు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
జూన్ 7 నుంచి 20 వరకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో యోగా పోటీలు కూడా నిర్వహించనున్నారు. వ్యక్తిగత ఆసనాలు, ప్రాణాయామం, గ్రూప్ యోగా, యోగా క్విజ్, వ్యాసరచన, నినాదాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. రాష్ట్ర స్థాయి విజేతలను అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.
ఇంటింటికీ యోగాను చేరువ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన ప్రత్యేక యోగా వీడియోలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాట్సాప్ నంబర్ 8142404888 కు “Hi” అని పంపితే క్యూ ఆర్ కోడ్ ద్వారా గూగుల్ డ్రైవ్ లింక్ లభిస్తుంది. యోగాసనాలు, ప్రాణాయామం, రోగ నివారణ, ధ్యానం వంటి అంశాలపై వీడియోలను ప్రజలు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సంజీవని యాప్ ద్వారా కూడా యోగా వీడియోలు అందుబాటులోకి రానున్నాయి.
యోగాంధ్ర-2026 కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా, యోగాను ప్రతి ఇంటికీ చేరవేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.