దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ దట్టమైన పొగమంచు, వాయు కాలుష్యం లో మునిగిపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో నగరమంతా పొగ, దుమ్ము మబ్బుల్లో కప్పుకుపోయినట్లుగా కనిపిస్తోంది. కానీ ఇది సహజమైన పొగమంచు కాదు వాహనాల ఉద్గారాలు, కట్టడాల దుమ్ము, పరిశ్రమల పొగ, పంట అవశేషాల దహనం కలిసి ఏర్పడిన స్మాగ్ (Smog) అని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. గాలి నాణ్యత సూచీ (AQI) 300 దాటడంతో పరిస్థితి “Very Poor” స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ కమిషన్ (CAQM) అత్యవసర చర్యలు చేపట్టింది.
తాజాగా ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-2 దశను అమలులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం వాయు కాలుష్యం తీవ్రతను బట్టి నాలుగు దశల్లో చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రెండో దశ (Stage-2)లో పలు ఆంక్షలు విధించబడ్డాయి. ప్రజలు తమ వ్యక్తిగత వాహనాల బదులు ప్రజా రవాణా (మెట్రో, బస్సులు) వినియోగించాలని సూచించారు. ధూళి, డస్ట్ ఉత్పత్తి చేసే నిర్మాణ పనులు, రోడ్డు తవ్వకాలు, వ్యర్థాల దహనం వంటి పనులు పూర్తిగా నిషేధించబడ్డాయి. రోడ్లపై దుమ్ము పేరుకుపోకుండా నీటి పిచికారీ చేయడం, మెషీన్లతో శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టాలని మునిసిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా NCR ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే డీజిల్ బస్సులను అనుమతించరు, అయితే CNG, ఎలక్ట్రిక్ బస్సులు, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. పరిశ్రమలు తమ కార్యకలాపాల్లో చట్టబద్ధమైన ఇంధనాలనే వాడాలని, నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
పర్యావరణ నిపుణులు చెబుతున్నదేమిటంటే, వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట అవశేషాలను కాల్చడం (stubble burning), వాహనాల ఉద్గారాలు, కట్టడాల పనులు, గాలి ప్రవాహం తగ్గడం వంటి అంశాలే ప్రధాన కారణాలు. ఈ సమయంలో గాలి వేగం తక్కువగా ఉండటం వల్ల కాలుష్యం కణాలు వాతావరణంలోనే నిలిచిపోతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.
ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలున్న వారు బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి అని సూచించింది. స్కూల్లలో అవుట్డోర్ స్పోర్ట్స్, అసెంబ్లీ కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేయాలని సూచనలు పంపింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిని మెరుగుపరచడం అత్యవసరం అయ్యింది. నిపుణుల అంచనాల ప్రకారం, వర్షపాతం లేకపోతే ఈ స్మాగ్ పరిస్థితి ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించి, వాహనాల వాడకాన్ని తగ్గించాలని అధికారులు కోరుతున్నారు.
ఢిల్లీలో AQI “Very Poor” స్థాయికి చేరింది
GRAP-2 దశ అమల్లోకి వచ్చింది
డస్ట్ సృష్టించే పనులకు నిషేధం
డీజిల్ బస్సులకు నో, CNG/EVలకు మినహాయింపు
ప్రజలు మాస్కులు ధరించాలని సూచన