- బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేయండి..
- రహదారులకు మహర్దశ: ఫిబ్రవరి 8లోగా శ్రీశైలం ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలి..
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా, భక్తి పారవశ్యంతో సజావుగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
శ్రీశైలంలోని సదాశివయ్య భవన్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎక్స్-ఆఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కలిసి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, శ్రీశైలం, ఆత్మకూరు డీఎఫ్వోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ: మహాశివరాత్రి పర్వదిన వేడుకల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహణ, దర్శన ఏర్పాట్లు, వసతి, భద్రత, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు, సంభవించే సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఎస్ఓపీని ఆధారంగా చేసుకొని అన్ని ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం అన్ని ఆలయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. భక్తులకు సజావుగా, సంతృప్తికరంగా దైవ దర్శనం కల్పించినప్పుడే ప్రభుత్వ చర్యలు విజయవంతమైనట్లవుతాయని స్పష్టం చేశారు.
వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు ప్రత్యేక స్లాట్లు కేటాయించి, నిర్ణయించిన సమయంలోనే దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అటవీ సంరక్షణ పరిధిలో ఉన్న ఆలయ ప్రాంతంలో విస్తరణ సాధ్యం కాకపోయినా, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అడవి మార్గంలో 48 కిలోమీటర్లు నడక దారిలో వచ్చే శివ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అటవీ శాఖ అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి సమస్యలను అధిగమించాలని మంత్రి ఆదేశించారు.
గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు టోల్ గేట్ల వద్ద వాహనాలకు ఉచిత అనుమతి ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించాలని ఆదేశించారు. సాక్షి గణపతి వద్ద రహదారి విస్తరణకు అవసరమైన స్థలాన్ని అటవీ శాఖ అందించినందున, సంబంధిత అధికారులు తక్షణమే రహదారి పనులు చేపట్టాలని సూచించారు. శ్రీశైలానికి వచ్చి వెళ్లే ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకున్నామన్న భావనతో తిరిగి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భారీగా తరలివచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే వారికి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించి, తగిన స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. ఉత్సవాల సమయంలో సున్నా ఘటనలు (Zero Incidents) జరిగేలా అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు మంత్రి ఆదేశించారు.
రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి తరలివచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు ఉన్న ప్రధాన రహదారుల మరమ్మతులు, విస్తరణ, గుంతల పూడిక, రహదారి భద్రతా చర్యలతో కూడిన పనులను ఈ నెల 8వ తేదీలోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ఉత్సవాల సమయంలో వాహనాల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో రహదారులు సక్రమంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని సూచించారు. భక్తుల సౌకర్యమే లక్ష్యంగా అధికారులు సమిష్టిగా పనిచేసి, ఏ చిన్న లోపం కూడా తలెత్తకుండా సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా, విజయవంతంగా జరిగేలా ప్రతి శాఖ బాధ్యతతో పని చేయాలని మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి అన్నారు.
ఎక్స్-ఆఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ లు మాట్లాడుతూ: ఈ సారి గతం కంటే 30 శాతం అధిక మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ: ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఖచ్చితమైన ప్రణాళికలతో విధులు నిర్వహించేలా గత సమావేశంలో అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, శ్రీశైలంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.