- రైతులకు అరచేతిలో సాగు సేవలు: ‘మన మిత్ర’లో ఈ-ఇరిగేషన్ ఫీచర్ ప్రారంభం
- వాట్సాప్ ద్వారానే సాగునీటి వివరాలు: రైతులకు ఏపీ ప్రభుత్వ డిజిటల్ విప్లవం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతాంగానికి సాగు సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘మన మిత్ర’ వాట్సాప్ ప్లాట్ఫామ్ ఇప్పుడు రైతులకు ఒక డిజిటల్ సేవగా మారుతోంది. వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంచడంతో పాటు, రైతులకు అవసరమైన సమాచారాన్ని వేగంగా అందించే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్లో ప్రభుత్వం తాజాగా ఈ-ఇరిగేషన్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. సాగునీటి నిర్వహణ నుంచి పంటల వివరాల వరకు అన్నింటినీ అరచేతిలోకి తీసుకువస్తూ అధికారులు ఈ వినూత్న వ్యవస్థను తీర్చిదిద్దారు.
సాధారణంగా రైతులు నీటి వనరుల వివరాల కోసం లేదా పంటల నమోదు స్థితిగతులను తెలుసుకోవడం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే సమాచారం పొందే వీలును ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. ఈ-ఇరిగేషన్ ఫీచర్ ద్వారా రైతులు తమ పొలాలకు అందుతున్న నీటి వనరుల లభ్యతను, పంటల సాగుకు సంబంధించిన కీలక గణాంకాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీనివల్ల రైతులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా సమాచారం పారదర్శకంగా అందుతుందని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వాట్సాప్ ద్వారానే సాగునీటి వివరాలు
ఈ అత్యాధునిక సేవలను వినియోగించుకోవడానికి రైతులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా 9552300009 అనే వాట్సాప్ నంబర్ను సేవ్ చేసుకుని కేవలం “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవలను యాక్సెస్ చేయవచ్చు. మెసేజ్ పంపిన వెంటనే వాట్సాప్ స్క్రీన్ పై కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాటిని అనుసరిస్తూ తమకు కావాల్సిన సమాచారాన్ని రైతులు ఎంచుకోవచ్చు. భాషా పరమైన ఇబ్బందులు లేకుండా రైతుకు కూడా అర్థమయ్యేలా సులభమైన రీతిలో ఈ ఛాట్ బాట్ వ్యవస్థను రూపొందించడం విశేషం.
‘మన మిత్ర’ వాట్సాప్ సేవలు
మరొక గమ్మత్తైన విషయం ఏమిటంటే కేవలం సమాచారం అందించడమే కాకుండా రైతులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించే దిశగా మన మిత్ర’ ప్లాట్ఫామ్ను ప్రభుత్వం విస్తరించింది. సూక్ష్మ సాగునీటి పద్ధతులను ప్రోత్సహించేందుకు డ్రిప్ స్ప్రింక్లర్ వంటి ఇరిగేషన్ సిస్టమ్స్ సోలార్ పంపుల వంటి ఖరీదైన పరికరాలను ఆన్లైన్లోనే బుక్ చేసుకునే సౌకర్యాన్ని త్వరలో పూర్తిస్థాయిలో కల్పించనున్నారు. రైతులు దళారీల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, వాటి స్థితిగతులను ట్రాక్ చేయడం ఈ ప్లాట్ఫామ్ ద్వారా సులభతరం కానుంది.
రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సమాచారం నుంచి సాగునీటి సౌకర్యాల వరకు అన్ని సేవలు ఒకే చోట లభించేలా ‘మన మిత్ర’ వాట్సాప్ సేవలను వన్-స్టాప్ సొల్యూషన్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రైతులు విరివిగా ఉపయోగించుకోవాలని, తద్వారా సాగు ఖర్చులు తగ్గించుకుని మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ సాంకేతిక విప్లవం దేశవ్యాప్తంగా సాగు రంగంలో జరుగుతున్న డిజిటల్ మార్పులకు దిక్సూచిగా నిలుస్తుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.