ఆంధ్రప్రదేశ్ రైతులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం అమ్మిన రైతులకు ఇకపై అదే రోజు వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 35 బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. రోజుకు నాలుగు సార్లు—మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7 గంటలకు రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు రైతు ధాన్యం అమ్మితే, మధ్యాహ్నం 12 గంటలకే డబ్బు జమ అయ్యేలా వ్యవస్థను రూపొందించామన్నారు. అయితే సెలవు దినాల్లో పేమెంట్ గేట్వేలు పనిచేయవు కాబట్టి, ఆ రోజుల్లో అమ్మిన ధాన్యానికి మరుసటి రోజు చెల్లింపులు జరుగుతాయని మంత్రి వివరించారు.
గత ప్రభుత్వ కాలంలో రైతులకు చెల్లింపులు 6 నుండి 9 నెలలు ఆలస్యమైనట్లు మంత్రి మనోహర్ ఆరోపించారు. ఆ కాలం నుండి సుమారు రూ.1670 కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా వేగవంతమైన చెల్లింపు విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే 87 శాతం రైతులకు 48 గంటల్లోనే డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. ఈసారి మాత్రం 24 గంటల్లో, చాలాసార్లు కేవలం 2 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతులు ఎప్పుడు ధాన్యం అమ్మినా, అదే రోజు డబ్బు అందేలా వ్యవస్థను రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. కౌలు రైతులకు ఉచితంగా 50 వేల టార్పాలిన్లు పంపిణీ చేయనున్నట్లు కూడా తెలిపారు.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 85 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని మంత్రి వివరించారు. ఇందులో 51 లక్షల టన్నులను సేకరించేందుకు కేంద్రం అనుమతిచ్చిందని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, మిల్లర్ల వద్ద ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసిందన్నారు. తేమ శాతం వివాదాలు లేకుండా ఒకే బ్రాండ్కు చెందిన బ్లూటూత్ యంత్రాల ద్వారా నాణ్యతను పరీక్షించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైతులు వాట్సాప్ ద్వారా తమ వివరాలను పంపి ధాన్యం అమ్మే విధంగా సౌకర్యం కల్పించామని మంత్రి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో నమోదు చేసిన ప్రతి రైతు ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేస్తుందనే హామీ ఇచ్చారు నాదెండ్ల మనోహర్. పుకార్లను నమ్మొద్దని రైతులను కోరారు. పెట్టుబడి రాయితీ చెల్లిస్తే పంట కొనరని ప్రచారం అసత్యమని ఆయన ఖండించారు. నవంబర్లో 11 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 25 లక్షలు, జనవరిలో 8 లక్షలు, ఫిబ్రవరిలో 3 లక్షలు, మార్చిలో 4 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పంట కోతలు పూర్తవడంతో కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. రైతులకు సమయానికి చెల్లింపులు జరగడంతో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చైతన్యం వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ నమ్మకం వ్యక్తం చేశారు.