Vijay Sethupathi Interview: భారతీయ చిత్ర పరిశ్రమలో విజయ్ సేతుపతి పేరు తెలియని వారుండరు. విలక్షణ నటనతో, విభిన్నమైన పాత్రలతో 'మక్కల్ సెల్వన్'గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకున్న నేను రౌడీనే సినిమా వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు.
సాధారణంగా హీరోలు కథ నచ్చితేనే సినిమా ఒప్పుకుంటారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం ఈ సినిమా కథ వింటున్నప్పుడు ఏకంగా నిద్రపోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ.. "డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈ సినిమా కథ చెబుతుంటే నాకు అస్సలు ఆసక్తి కలగలేదు. స్టోరీ వింటూనే కోటు వేసుకుని హాయిగా గురకపెట్టి నిద్రపోయాను" అని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. అయితే, విఘ్నేష్ శివన్ గతంలో తీసిన 'పోడా పోడి' సినిమా విజయ్కు చాలా ఇష్టం. ఆ నమ్మకంతోనే, కథ బోర్ కొట్టినప్పటికీ డైరెక్టర్ ప్రతిభను నమ్మి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
తన కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. 'జవాన్'లో విలన్గా మెప్పించిన ఆయన, సినిమాల ఎంపికపై తనదైన శైలిలో స్పందించారు. "నేను చేసే సినిమాలు మాత్రమే కాదు, చిత్ర పరిశ్రమ మొత్తం బాగుండాలనేది నా కోరిక. అందుకే కొన్నిసార్లు పాత్ర నిడివి తక్కువగా ఉన్నా సినిమాలు చేస్తాను. అయితే రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ సినిమాల్లో (జైలర్) నటించడం నా స్వార్థం. చిన్నప్పటి నుండి వారిని చూస్తూ పెరిగాను, అందుకే కథ వినకుండానే అలాంటి సినిమాల్లో భాగమవుతాను అని చెప్పుకొచ్చారు.
నిర్మాతలు తన ఫోటోను పోస్టర్లపై వాడుకోవడం వల్ల ఒక్కోసారి అసలు హీరోలకు అన్యాయం జరుగుతుందని భావించిన విజయ్, ఇప్పుడు పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేవలం గుర్తింపు కోసమే కాకుండా, కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏది ఏమైనా, తాను నిద్రపోయిన కథే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.