- కన్నవాళ్లతో వెళ్లేందుకు నిరాకరించి.. భర్తతోనే ఉంటానన్న యువతి..
- Media: మూడేళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో సాహసం..
Cousin Marriage: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో అత్యంత వింతైన, వివాదాస్పదమైన ఒక ప్రేమకథ వెలుగులోకి వచ్చి స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు, వరుసకు తమ్ముడయ్యే సొంత పిన్ని కొడుకుతో కలిసి పారిపోవడమే కాకుండా, వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లికి చెందిన శశికళ, హోస్కోట్కు చెందిన ప్రవీణ్ గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి తల్లులు స్వయానా అక్కాచెల్లెళ్లు కావడంతో, రక్తసంబంధం రీత్యా వారు అక్కాతమ్ముళ్లు అవుతారని, ఈ బంధాన్ని సామాజిక కట్టుబాట్లు అంగీకరించవని పెద్దలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే శశికళకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించి నిశ్చితార్థం కూడా పూర్తి చేశారు.
అయితే, వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయి, ముహూర్తానికి కొన్ని గంటల సమయం ఉందనగా శశికళ తన ప్రియుడు ప్రవీణ్తో కలిసి ఇంటి నుంచి నిష్క్రమించింది. అనంతరం అంగట్ట ప్రాంతంలోని ఒక శివాలయంలో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని భావించిన ఈ జంట, రక్షణ కల్పించాలంటూ చిక్కబళ్లాపూర్ ఎస్పీ కార్యాలయానికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందుకున్న శశికళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా నెలకొంది.
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే శశికళ తల్లి తన కుమార్తె నిర్ణయాన్ని తప్పుబడుతూ కన్నీరుమున్నీరైంది. వరుసకు తమ్ముడయ్యే వ్యక్తిని వివాహం చేసుకుని కుటుంబ గౌరవాన్ని బజారున పడేశావంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ, శశికళ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడింది. తనకు తన భర్త ప్రవీణే సర్వస్వమని, తల్లిదండ్రులతో వెళ్లే ప్రసక్తే లేదని పోలీసుల సమక్షంలోనే తెగేసి చెప్పింది. కట్టుబాట్లను, రక్తసంబంధాలను కాదనుకుని సాగిన ఈ వింత వివాహం ప్రస్తుతం కన్నడనాట సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది.