దీపావళి పండుగ రాకముందే దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య మేఘాల కింద నలిగిపోతోంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ నగర వాతావరణం పొగ, ధూళి, పొల్యూషన్తో కమ్ముకుపోయింది. గాలి నాణ్యత సూచీ (AQI) అనేక ప్రాంతాల్లో 300 మార్కును దాటడంతో, ఇది “చాలా ప్రమాదకర స్థాయి”గా పరిగణించబడుతోంది. ప్రజలు శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది పడుతుండగా, పిల్లలు, వృద్ధులు, ఆస్తమా రోగులకు ఈ పరిస్థితి తీవ్ర ప్రమాద సంకేతాలను ఇస్తోంది.
ఢిల్లీలోని ఆనంద్ విహార్, వజీర్పూర్, ఘజియాబాద్, నోయిడా ప్రాంతాలు అత్యంత దారుణ స్థితిలో ఉన్నాయి. ఘజియాబాద్లో AQI 339గా, నోయిడా సెక్టర్ 125లో 358గా, ఆనంద్ విహార్లో 335, వజీర్పూర్లో 337గా నమోదైంది. ఇది “చాలా ప్రమాదకరం” కేటగిరీకి చెందిన గాలి నాణ్యత. గాలి వేగం తక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతల మార్పు, వాతావరణంలో పీఎం10, ఓజోన్ రేణువుల అధిక సాంద్రత కారణంగా కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితి మరింత విషమించకముందే అధికారులు చర్యలు ప్రారంభించారు. పర్యావరణ శాఖ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) తొలి దశను అమలు చేసింది. దీనిలో భాగంగా నిర్మాణ, కూల్చివేత పనులకు తాత్కాలిక నిషేధం విధించారు. డీజిల్ జనరేటర్ల వాడకం, తెరువులో చెత్త దహనం వంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టారు. కాలుష్యం మరింత పెరిగితే, రెండో దశ కింద స్కూల్ల మూసివేత, వాహనాల నియంత్రణ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
వైద్య నిపుణులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పుడు వీలైనంతవరకు బయటకు వెళ్లకుండా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని, బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడడం, గాలి శుద్ధి మొక్కలు పెంచడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థలు కూడా ప్రజలను కాలుష్య నియంత్రణలో భాగస్వాములుగా మారమని విజ్ఞప్తి చేస్తున్నాయి.