ఆంధ్రప్రదేశ్: రాబోయే 24 గంటల్లో వర్షాలు అధికంగా మారనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశలో కదలుతూ ఆంధ్ర, ఒడిశా తీరాలకు చేరే అవకాశముందని అధికారులు తెలిపారు.
దీంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కర్ణాటకలో ఏర్పడిన మరో అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశలో కదులుతూ తూర్పు మధ్య సముద్రం మీదుగా రాష్ట్రాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ రెండు అల్పపీడనాల కారణంగా దక్షిణ భారతదేశంలో వాతావరణం అస్థిరంగా ఉంటుంది.
కోస్తా ప్రాంతాల్లో గాలి, వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని తెలిపారు. రాబోయే 48 గంటల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంలో గాలి ఉంటుంది. గాలితో పాటు మెరుపులు, ఉరుములు కూడా సంభవించవచ్చని హెచ్చరించారు. తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. నంద్యాల, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉంది. చిన్న వాగులు, వంకల ప్రవాహాలు వేగంగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు రాబోయే మూడు రోజులు సముద్ర యాత్రలు చేయకుండా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
రైతుల కోసం వాతావరణం రెండు విధాలుగా ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే సాగులో ఉన్న రబీ పంటలకు వర్షం లాభదాయకం, కానీ వరి కోత దశలో ఉన్న ప్రాంతాల్లో ధాన్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి వర్ష ప్రభావిత జిల్లాల పరిస్థితి గురించి మంత్రులు, కలెక్టర్లు, అధికారులు తో ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చించడం జరుగుతుంది.ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, రహదారులు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. వాతావరణం అస్థిరత కొనసాగుతుందని, ప్రజలు, రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.