కృష్ణా జిల్లాలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను గురువారం పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రైతుల బాధలను ప్రత్యక్షంగా విన్నారు. అవనిగడ్డలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి రైతు వెనుక ప్రభుత్వం ఉంది. ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పంట నష్టపోయిన ప్రతి కుటుంబానికి మద్దతుగా నిలుస్తాం అని హామీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ వివరించిన ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలోనే 46 వేల హెక్టార్ల పంటలు నాశనమయ్యాయని, దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. ఈ తుపాను తీవ్రతను తగ్గించడంలో ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక కీలక పాత్ర పోషించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో యంత్రాంగం అప్రతిహతంగా పనిచేసింది అని ఆయన చెప్పారు.
తుపాను తాకిడికి ముందు సుమారు లక్షా 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి పునరావాస కేంద్రంలో ఆహారం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలను సిద్ధం చేశాం. బాధితులు తమ ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నాం. ప్రతి కుటుంబానికి గరిష్టంగా మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం అని వివరించారు.
తుపానుతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం, ఇతర కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రహదారులు, డ్రెయిన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం 274 కిలోమీటర్ల రహదారులను శాశ్వతంగా పునరుద్ధరించేలా ఆదేశించాం. తుపానుతో నీరు నిల్వ ఉన్న గ్రామాల్లో సూపర్ శానిటేషన్, సూపర్ క్లోరినేషన్ ప్రారంభించాం. అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు.
జిల్లా స్థాయిలో 21 వేల మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి, 1,500కు పైగా గ్రామాల్లో శుభ్రత పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
తుపాను నష్టంపై పూర్తి నివేదిక వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ సహాయం కోరుతాం. కౌలు రైతులు కూడా నష్టపోయిన విషయం నాకు తెలుసు. వారిని ఆదుకునే చర్యలపై ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
కోడూరు మండలంలో దెబ్బతిన్న అవుట్ఫాల్ స్లూయిజ్ నిర్మాణానికి నాబార్డ్ సాయం పొందనున్నట్లు, ఎదురుమొండి–గొల్లమంద రహదారి పునర్నిర్మాణానికి రూ.13.08 కోట్లు కేటాయించి టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ రహదారి నిర్మాణం ఐదు గ్రామాలకు మేలు చేస్తుందని తెలిపారు.
ప్రతీ విపత్తు తర్వాత ప్రభుత్వం మొదటగా చేయవలసింది ప్రజలను రక్షించడం. అదే మేము చేశాం. ప్రజల జీవితం సాధారణ స్థితికి చేరేవరకు యంత్రాంగం వెనక్కి తగ్గదు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ పర్యటనలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.