మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్పై విరుచుకుపడి భారీ విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తగ్గినప్పటికీ, పంటలు, ఇళ్లు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిశాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఒంగోలు నగరం 25 సెంటీమీటర్ల వానతో జలమయమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులు దెబ్బతిన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.23 లక్షల హెక్టార్లలో పంటలు నాశనం అయ్యాయి. వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు నీటమునిగిపోయాయి. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లారు. చెట్లు, ఇళ్లు కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో మరణాలు సంభవించాయి. మరో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో సహాయక చర్యలు చేపట్టి 38 మందిని రక్షించారు. బాపట్లలో డ్రోన్ సాయంతో ఒకరిని గుర్తించి కాపాడారు. ప్రభుత్వం అత్యవసర నియంత్రణ కేంద్రాల ద్వారా పర్యవేక్షణ కొనసాగిస్తోంది. గల్లంతైన వారిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
విద్యుత్తు శాఖకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది. సబ్స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో సుమారు రూ.18 కోట్ల నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. EPDC, CPDC, SPDC పరిధుల్లో భారీగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను మోహరించింది.
మొత్తంగా మొంథా తుఫాన్ రాష్ట్రానికి పెద్ద సవాలు తీసుకొచ్చింది. పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్తు సదుపాయాలు ధ్వంసమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తుఫాను బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించే దిశగా చర్యలు చేపడుతోంది.