దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో గ్రూప్–డి ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 22,195 గ్రూప్–డి పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ, అప్రెంటిస్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వేలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఇది ఒక అరుదైన అవకాశంగా చెప్పవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 2, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే రీజియన్కు కూడా పెద్ద సంఖ్యలో పోస్టులు కేటాయించారు. సికింద్రాబాద్ పరిధిలో మొత్తం 1012 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో పాయింట్స్మన్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ నియామకాలు చేపడతారు. రైల్వే విభాగాల్లో గ్రౌండ్ లెవల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే పోస్టులు కావడంతో, ఉద్యోగ భద్రతతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అర్హత విషయానికి వస్తే, అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి లేదా అప్రెంటిస్షిప్ అర్హత కలిగి ఉండాలి. వయస్సు పరంగా 2026 జనవరి 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. అయితే రాత పరీక్షకు హాజరైన వారికి రూ.400 రీఫండ్ చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 మాత్రమే చెల్లించాలి. వీరు పరీక్ష రాస్తే పూర్తి ఫీజు రీఫండ్ పొందుతారు.
ఎంపిక ప్రక్రియ మొత్తం ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్నెస్ & కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు లెవెల్–1 పోస్టులకు నెలకు రూ.18,000 బేసిక్ జీతంతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులతో మొదటి నెల నుంచే సుమారు రూ.35,000 వరకు జీతం అందనుంది.