Politics- 2008 నాటి వ్యూహంతో రంగంలోకి పవన్.. జనసేనలో కీలక మార్పులు!
కార్యకర్తలతో వాట్సాప్లో పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయి నుంచే పర్యవేక్షణ!
క్రమశిక్షణ తప్పితే ఊపేదే లేదు.. ఒంగోలు కమిటీ రద్దుపై పవన్ సంచలన వ్యాఖ్యలు!
Pawankalyan: జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త కార్యాచరణను ప్రకటించారు. రాజమండ్రిలో నిర్వహించిన 'జనసేన సాధక్ ఆత్మీయ సమావేశం'లో ఆయన పాల్గొని, పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గతంలో తాము సాధించిన ఫలితాలు తక్కువగా, అంతర్గత విబేధాల గోల ఎక్కువగా ఉండటం వల్లే ఒంగోలు కమిటీని పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణే పరమావధిగా ఇకపై నూతన యంత్రాంగం నడుస్తుందని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో పార్టీ సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉండబోతుందో పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా వివరించారు. గతంలో 2007-08 నాటి కాలంలో యువజన విభాగం కోసం తాను స్వయంగా రూపొందించుకున్న ప్రత్యేక స్ట్రక్చర్ను (నిర్మాణాన్ని) ఇప్పుడు జనసేనలో పూర్తిస్థాయిలో అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయి సమస్యలపై కనీస అవగాహన, పోరాడే తత్వం లేకుండా ఎవరికీ పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. సుమారు 12 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఎన్నో దెబ్బలు తిని, ఓర్చుకుని ఇక్కడి దాకా నిలబడిన తన మాటను నమ్మి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పార్టీలో నియోజకవర్గ, మండల స్థాయి ఇంఛార్జ్ల నియామకానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక పారదర్శక విధానాన్ని ప్రకటించారు. ఇకపై ఎక్కడైనా ఇంఛార్జ్ను నియమించాలంటే క్షేత్రస్థాయిలోని 'సాధక్' (పార్టీ పటిష్టతకు కృషి చేసేవారు) మరియు 'ఉద్యమీ' (క్రియాశీల కార్యకర్తలు) ల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు ఒక చీఫ్ అబ్జర్వర్ నేతృత్వంలో ప్రత్యేక పరిశీలన కమిటీలను పంపించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలు గ్రౌండ్ లెవెల్లో పర్యటించి ఇచ్చే నివేదికల ఆధారంగానే తుది ఎంపికలు జరుగుతాయని స్పష్టం చేశారు.
పార్టీ క్యాడర్తో తనకున్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు సాంకేతికతను వాడుకోనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపై ప్రతి నియోజకవర్గంలోని జనసేన 'ఉద్యమీ'లతో తాను నేరుగా వాట్సాప్ ద్వారా నిరంతరం టచ్లో ఉంటానని, క్షేత్రస్థాయి పరిణామాలను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది జనసేన సాధక్లు ఐక్యంగా గొంతు ఎత్తితే, కోట్ల మందిని నడిపించే ప్రభుత్వ యంత్రాంగం కూడా కదలాల్సిందేనని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కులాల ప్రాతిపదికన సాగే ఏపీ రాజకీయాల్లో తాను ఇంతవరకు రావడం అంటే పక్క రాష్ట్రంలో పదిసార్లు సీఎం అయినదానితో సమానమని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష నేతల విమర్శలపై కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి అరెస్టయి జైలుకు వెళ్లినప్పుడు సొంత పార్టీ నేతలే ఒక్కరు కూడా అడుగు బయటకు పెట్టలేదని గుర్తు చేశారు. మనం ఎదగడం కోసం పక్కవాడు జైలుకు వెళ్లాలి లేదా భౌతికంగా లేకుండా పోవాలి అనుకునే దిగజారుడు రాజకీయాలు తాము చేయబోమని హితవు పలికారు. అలాగే కొందరు నేతలు తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాము నోరు తెరిస్తే అవమానం జరిగిందని అనడం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలను ఎదుర్కొంటూనే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జనసేన ప్రయాణం సాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.