Politics- ముఖ్యమంత్రి దృష్టికి ట్రాన్స్జెండర్ల ఇబ్బందులు…
ట్రాన్స్జెండర్ల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతా…
గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవిపై ప్రశంసల వర్షం…
Galla Madhavi: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను రూపుమాపడానికి గంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కేవలం సానుభూతి చూపడం కాకుండా, వారికి గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక ట్రాన్స్జెండర్ యువతిని తన వ్యక్తిగత కార్యదర్శి (PA)గా నియమించుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా ట్రాన్స్జెండర్ల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె చాటిచెప్పారు.
గతంలో తిరుపతి పర్యటనకు వెళ్లిన సమయంలో కొందరు ట్రాన్స్జెండర్లు తమ సమస్యలను ఎమ్మెల్యే గళ్లా మాధవికి వివరించారు. చదువుకున్నప్పటికీ తగిన గుర్తింపు, ఉపాధి లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 6న బీకాం చదివిన ఒక ట్రాన్స్జెండర్ యువతి ఎమ్మెల్యేను కలిసి ఉద్యోగం కోరారు. ఆ యువతి ప్రతిభను గుర్తించిన మాధవి, తక్షణమే తన కార్యాలయంలో పీఏగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. చదువుకున్న ట్రాన్స్జెండర్లు ఇంకా ఎవరైనా వస్తే వారికి కూడా ఉపాధి కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు.
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, రైళ్లలో ట్రాన్స్జెండర్లు పడుతున్న ఇబ్బందులను చూసి తాను ఎప్పుడూ చలించిపోయేదాన్నని మాధవి పేర్కొన్నారు. సమాజం వారిని వెలివేసినట్లు చూడటం వల్లే వారు వెనకబడిపోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. "ప్రస్తుత రోజుల్లో జంతువుల హక్కుల కోసం పోరాడే వారు ఉన్నారు కానీ, తోటి మనుషులైన ట్రాన్స్జెండర్ల గురించి ఆలోచించేవారు తక్కువయ్యారు" అని ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. వారికి కూడా సమాజంలో హోదా, సమానత్వం దక్కాలని ఆమె ఆకాంక్షించారు.
ట్రాన్స్జెండర్ల సాధికారత కోసం ప్రభుత్వం ఇప్పటికే పింఛన్లు, ఇళ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో వారు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. వారికి ప్రత్యేక రిజర్వేషన్లు లేదా వెసులుబాటు కల్పించడం ద్వారా గౌరవప్రదమైన స్థానాలను పొందేలా కృషి చేస్తానని చెప్పారు.
గళ్లా మాధవి తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి తన కార్యాలయంలోనే ఇటువంటి నియామకం చేపట్టడం వల్ల ఇతర సంస్థలు మరియు వ్యక్తులు కూడా ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం సమాజంలో ఒక పాజిటివ్ ప్రకంపనను సృష్టించడమే కాకుండా, విజ్ఞత కలిగిన రాజకీయాలకు నిదర్శనంగా నిలిచింది.