Politics- మేధా టవర్స్, ఎస్ఆర్ఎం వర్సిటీల్లో క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ఆవిష్కరణ.
టీఐఎఫ్ఆర్, డీఆర్డీవో సహకారంతో ఏపీలో హైటెక్ ప్రయోగం…
ఏపీ గడ్డపై క్వాంటం శాస్త్రవేత్తల మేధోమథనం…
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంకేతిక రంగంలో మరో చారిత్రక మైలురాయిని అధిగమించబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) అమరావతిలోని ఎస్ఆర్ఎం (SRM) యూనివర్సిటీ వేదికగా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్వాంటం కంప్యూటింగ్ టెస్ట్ బెడ్స్ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం వర్సిటీలో ఒకటి, గన్నవరం మేధా టవర్స్లో మరొకటి చొప్పున మొత్తం రెండు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను (1S, 1Q) ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ రెండు వేర్వేరు టెస్ట్ బెడ్స్ ప్రారంభోత్సవం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుండే రిమోట్ విధానంలో జరగనుంది.
ఈ ఆవిష్కరణతో దేశంలోనే 'క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ' కలిగిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించనుంది. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) మరియు డీఆర్డీవో (DRDO) వంటి అగ్రశ్రేణి సంస్థలు సాంకేతిక సహకారాన్ని అందించాయి. రేపటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ ప్రతినిధులు, వివిధ ఐఐటీల ప్రొఫెసర్లు, క్వాంటం రంగ శాస్త్రవేత్తలతో పాటు క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు మరియు రీసెర్చ్ స్కాలర్లు భారీగా హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి వెళ్లడానికంటే ముందు, నేడు సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) పనితీరుపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సాంకేతికతను పాలనలో జోడించి, ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఆర్టీజీఎస్ విభాగంలో తీసుకురావాల్సిన మార్పులపై ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. అమరావతిని గ్లోబల్ టెక్ హబ్గా మార్చే దిశలో ఈ క్వాంటం టెస్ట్ బెడ్స్ ప్రారంభం కీలక అడుగుగా భావిస్తున్నారు.