రైతుల త్యాగం… అమరావతికి బలమైన పునాది..
అభివృద్ధి దిశగా అమరావతి..
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సంఘటనగా మారింది. ఐదుకోట్ల ఆంధ్రుల కల అయిన అమరావతికి శాశ్వతత్వం కల్పించిన ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. “మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – మా రాజధాని అమరావతి” అని గర్వంగా చెప్పుకునేలా చేసిన ఈ నిర్ణయం కోసం ఐదుకోట్ల ఆంధ్రుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ, అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని, 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని రాష్ట్రపతికి వివరించారు. అమరావతి చరిత్ర, సంస్కృతి, ఇప్పటికే పూర్తైన నిర్మాణాలు, భవిష్యత్తు మాస్టర్ ప్లాన్, పర్యావరణహిత ప్రణాళికలతో రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు.
అమరావతి నిర్మాణం వెనుక రైతుల త్యాగం ఎంతో గొప్పదని లోకేష్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్నో ఇబ్బందులు, కేసులు ఎదురైనా రైతులు శాంతియుతంగా తమ ఉద్యమాన్ని కొనసాగించారని చెప్పారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రైతుల త్యాగాలను ప్రశంసించారు. రాష్ట్రంపై ప్రేమతో భూములు ఇచ్చిన రైతులు నిజమైన భాగస్వాములని అభినందించారు. “పోరాడి సాధించుకున్నది ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఆయన దూరదృష్టితో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని, రాజధాని పనులు అడ్డంకులు లేకుండా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ పరిణామంతో అమరావతి రాజధాని నిర్మాణానికి మరింత బలం చేకూరగా, ఆంధ్రుల కల నిజమవుతుందనే నమ్మకం ప్రజల్లో మరింత పెరిగింది.