భారతదేశంలో మధుమేహం (డయాబెటిస్) నిర్ధారణ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న హెచ్బీఏ1సీ (HbA1c) పరీక్షపై ప్రముఖ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ – సౌత్ ఈస్ట్ ఆసియా’ కీలక హెచ్చరిక జారీ చేసింది. భారతీయులు సహా దక్షిణాసియా ప్రజల్లో డయాబెటిస్ను గుర్తించేందుకు కేవలం హెచ్బీఏ1సీ పరీక్షపైనే పూర్తిగా ఆధారపడటం సరైన విధానం కాదని నిపుణులు స్పష్టం చేశారు. భారతీయుల్లో అధికంగా కనిపించే రక్తహీనత (అనీమియా) వంటి సమస్యలు ఈ పరీక్ష ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. దీని వల్ల కొందరిలో మధుమేహం ఉన్నా గుర్తించకపోవడం, లేదా లేకపోయినా ఉన్నట్లు తప్పుడు నిర్ధారణ కావడం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఢిల్లీలోని ఫోర్టిస్-సీడీఓసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఛైర్మన్ ప్రొఫెసర్ అనూప్ మిశ్రా నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. భారతీయుల్లో ఐరన్ లోపంతో కూడిన అనీమియా, థలసేమియా, జీ6పీడీ లోపం వంటి హిమోగ్లోబిన్కు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉండటం గమనించబడింది. ఈ పరిస్థితులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కొలిచే హెచ్బీఏ1సీ రీడింగ్స్ను వక్రీకరించే అవకాశముందని పరిశోధకులు తెలిపారు. ఫలితంగా రోగ నిర్ధారణలో పొరపాట్లు జరిగే ప్రమాదం ఉందని అధ్యయనం స్పష్టం చేసింది.
“హెచ్బీఏ1సీ ఒక్కటే ప్రమాణంగా తీసుకుంటే డయాబెటిస్ నిర్ధారణలో లోపాలు తలెత్తవచ్చు. కొందరిలో వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల గుండె, కిడ్నీ, కంటి సమస్యలు వంటి సంక్లిష్టతలు పెరిగే అవకాశం ఉంది” అని ప్రొఫెసర్ అనూప్ మిశ్రా పేర్కొన్నారు. ఈ సమస్యను నివారించేందుకు బహుళ పరీక్షల విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు. ముఖ్యంగా ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (OGTT), సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ (SMBG), కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ (CGM) వంటి పద్ధతులను హెచ్బీఏ1సీతో పాటు ఉపయోగించడం ద్వారా మరింత ఖచ్చితమైన నిర్ధారణ సాధ్యమవుతుందని వివరించారు.
ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వనరులు పరిమితంగా ఉండే పరిస్థితుల్లో కచ్చితమైన రోగ నిర్ధారణకు సమగ్ర పరీక్షా విధానం అత్యంత అవసరమని అధ్యయనం నొక్కి చెప్పింది. భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, సరైన నిర్ధారణే సమర్థవంతమైన చికిత్సకు పునాది అని నిపుణులు హెచ్చరించారు. ఆరోగ్య విధాన రూపకర్తలు, వైద్యులు ఈ అంశాన్ని గంభీరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ‘లాన్సెట్’ అధ్యయనం స్పష్టం చేసింది.