- స్వచ్ఛందంగా చేసే ప్రతిపాదనలు పరిశీలించబడవన్న మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్..
- మారుతున్న డిమాండ్ల మేరకు నర్సులకు శిక్షణ ఇవ్వాలన్న మంత్రి..
- రాష్ట్రంలో నర్సుల డిమాండ్-సప్లై ఆధారంగా నిర్ణయం..
AP Government: రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు నేపథ్యంలో ప్రతి సంవత్సరం వేలాది నర్సింగ్ సీట్లు మిగిలిపోతున్నందున పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి రాష్ట్ర అవసరాల దృష్ట్యా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల మేరకు వచ్చే ప్రతిపాదనల్ని మాత్రమే పరిశీలిస్తామని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారంనాడు వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో నర్సింగ్ విద్యకు సంబంధించిన పలు అంశాల సమీక్షా సమావేశంలో విస్తృత చర్చ అనంతరం మంత్రి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు.
నిర్ణయ నేపథ్యం
రాష్ట్రంలో ఇప్పటికే 691 నర్సింగ్ విద్యా సంస్థలు నడుస్తున్నాయని, వీటి ద్వారా ప్రతి ఏడాదీ దాదాపు 32,000 మంది నర్సులు పట్టబద్రులవుతున్నారని, దరిమిలా గత కొన్నేళ్లుగా సుమారు 6,000 నర్సింగ్ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయని సమీక్షలో అధికారులు మంత్రికి వివరించారు. 2014 నుంచి నేటి వరకు 243 నర్సింగ్ కాలేజీలు, స్కూళ్లు మంజూరు చేయబడ్డాయని వారు తెలిపారు. ఇవన్నీ వివిధ సంస్థల స్వీయ ప్రతిపాదనల మేరకు (సుమోటో) వివిధ ప్రభుత్వాలు మంజూరు చేశాయి. ఇందుకు భిన్నంగా మొదటిసారిగా కూటమి ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుకు ఔత్సాహిక సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనకు స్పందించి వచ్చిన దాదాపు 345 దరఖాస్తులు హైపవర్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. ఈ కారణాల వలన పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కీలక నూతన నిర్ణయాన్ని ప్రకటించారు. గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన సమీక్షలో హైపవర్ కమిటీ ఛైర్మన్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఉప్నాక దుర్గాప్రసాదరావు, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్, డిఎంఇ డాక్టర్ రఘునందన్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ శ్రీమతి సుశీల, ఇతర పలువురు ఉన్నతాధికారులు, నర్సింగ్ కాలేజీల మేనేజ్మెంట్ ఆసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
సుమోటో ప్రతిపాదనలను పరిశీలనకు చేపట్టరాదన్న నిర్ణయానికి సంబంధించిన లోతుపాతులను మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఛైర్మన్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి తో చర్చించారు.
మారుతున్న డిమాండ్లకు అనుగుణంగా నర్సులకు శిక్షణ ఇవ్వాలి-మంత్రి 2029 నాటికి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఆరోగ్య రంగంలో లభించే అవకాశాలపై సమీక్షలో చర్చ జరిగింది. ఈ రంగంలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలున్నాయని, నర్సింగ్ శిక్షణలో తగు మార్పులతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించవచ్చని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్నారు. జెరియాట్రిక్ సేవలు (వృద్ధుల ఆరోగ్య అవసరాలు), శిశు సంరక్షణ సేవలు, మానసిక ఆరోగ్య సేవలకు డిమాండ్ బాగా పెరుగుతున్నందున నర్సింగ్ శిక్షణలో ఈ అంశాలను పొందుపర్చాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ నర్సింగ్ విద్యా సంస్థల్లో త్వరలో ఈ అంశాలకు సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ రెసిడెస్సీ ప్రోగ్రాంను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ శ్రీమతి సుశీల తెలిపారు.