Naidupeta Public Meeting: నాయుడుపేట వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తుపై తన విజన్ను స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, రాబోయే నాలుగేళ్లలో ఏపీ రూపురేఖలు ఎలా మార్చబోతున్నారో వివరించారు.
పేదలందరికీ సొంతింటి కల.. ఉచిత విద్యుత్!
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవాడు ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. 2029 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఇందుకోసం మరో 17 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉందన్నారు. జూన్ నాటికి 2 లక్షలు, సెప్టెంబర్ నాటికి మరో 1.60 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచిత విద్యుత్ పొందేలా ప్రజలను ప్రోత్సహిస్తామని, పంపుసెట్లకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
దీపం 2.0తో వెలుగులు.. మహిళా సాధికారతే ధ్యేయం
మహిళల సంక్షేమం కోసం 'దీపం 2.0' పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని, భవిష్యత్తులో పైపుల ద్వారానే గ్యాస్ సరఫరా చేస్తామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, వచ్చే ఏడాది నాటికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. 2029 నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తాయని, రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని పిలుపునిచ్చారు.
జల జీవన్ మిషన్ పునరుద్ధరణ.. పోలవరం పూర్తి
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 'జల జీవన్ మిషన్'ను మళ్లీ గాడిలో పెట్టామన్నారు. కేంద్రంతో మాట్లాడి 2028 వరకు ఈ పథకాన్ని పొడిగించామని, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిని గత పాలకులు ముక్కలు చేశారని, దానికి చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు.
మత్స్యకారుల భద్రత.. సముద్ర తీరంలో నిఘా
మత్స్యకారుల ప్రయోజనాల దృష్ట్యా వేట నిషేధ కాలంలో ఇచ్చే సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇతర రాష్ట్రాల బోట్లు వచ్చి మన తీరంలో చేపలు పట్టకుండా ఉండేందుకు నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని, నిఘా కోసం ప్రత్యేకంగా రెండు బోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. నాయుడుపేటలో అటానమస్ షిప్ యార్డు ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సుపరిపాలనే లక్ష్యం.. అవినీతిపై ఉక్కుపాదం
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా వ్యవస్థను క్రమబద్ధీకరించామని బాబు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా నాయుడుపేట రిజిస్ట్రేషన్ శాఖపై ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు. సంపద సృష్టించి, ఆ సంపదను పేదలకు పంచడమే తన మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ముగించారు.